Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసా...ఇక మరింత కఠినం

By:  Tupaki Desk   |   23 Feb 2018 10:39 AM GMT
హెచ్1బీ వీసా...ఇక మరింత కఠినం
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం నైపుణ్యాన్ని న‌మ్ముకున్న వ‌లస ఉద్యోగుల‌కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. తాజాగా హెచ్1బీ వీసాల జారీపై అమెరికా ప్రభుత్వం ప్రకటించిన‌ కొత్త విధానం మ‌నోళ్ల‌కు గొడ్డ‌లిపెట్టుకానుండటం గ‌మ‌నార్హం. ట్రంప్ స‌ర్కారు తాజా విధానం భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాకు ప్రొఫెషనల్ ఉద్యోగులను పంపాలనుకుంటున్న ఆయా భారతీయ కంపెనీలు ఇక నుంచి తమ ఉద్యోగులకు సంబంధించిన అదనపు వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ వర్క్‌ సైట్లకు ఉద్యోగులను పంపాలనుకుంటే - కొత్త వీసా విధానం వల్ల ఆయా కంపెనీలు మరింత సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది.

హెచ్1బీ వీసా ద్వారా ఐటీ ఉద్యోగులు కొన్ని నెలల లేదా సంవత్సరాల కోసం అమెరికా వెళ్తుంటారు. అయితే హెచ్1బీ వీసాను ఎక్కువ శాతం భారతీయ ఐటీ కంపెనీలు వాడుతుంటాయి. థర్డ్ పార్కీ వర్క్‌ సైట్‌ లో ఎన్ని రోజులు పని ఉంటుందో - అన్ని రోజుల వరకే హెచ్1బీ వీసాను జారీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 2019వ సంవత్సరానికి ఏప్రిల్ 2వ తేదీ నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తులు జారీ చేయనున్నారు. అయితే నూతన మార్గదర్శకాలు ఈ సీజన్ నుంచి అమలుకానున్నాయి. సాధారణంగా హెచ్1బీ వీసాను మూడేళ్ల కోసం జారీ చేస్తారు. ఒకవేళ ఉద్యోగులు ఎవరైనా బెంచ్ మీద ఉంటే, వాళ్లను వెంటనే స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్1బీ వీసా కోరే కంపెనీలు తమ ఉద్యోగికి సంబంధించి పేపర్ వర్క్‌ను విస్తృతస్థాయిలో చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఉద్యోగం చేస్తాడు - ఎన్ని గంటలు చేస్తాడు - ఎన్ని రోజులు చేస్తాడు - ఎంత సంపాదిస్తాడా అన్న అంశాలను కూడా చేర్చాల్సి ఉంటుంది.

ఈ నిబంధ‌న‌ల‌ను భార‌తీయ కంపెనీల‌కు ఇర‌కాట‌మేన‌ని - మ‌నో ఉద్యోగుల‌కు సైతం ఇక్క‌ట్ల పాలు చేసేవేన‌ని అంటున్నారు. వ‌ల‌స ఉద్యోగుల‌కు బ్రేకులు వేసేందుకే ఈ విధానం తెచ్చార‌ని ఐటీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి.