Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డి కోతి పనులు...ల‌క్ష కోట్లు తినేశారు

By:  Tupaki Desk   |   24 Oct 2017 9:14 AM GMT
కోమ‌టిరెడ్డి కోతి పనులు...ల‌క్ష కోట్లు తినేశారు
X
న‌ల్ల‌గొండ జిల్లా రాజకీయాలు మ‌ళ్లీ వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తాజా - మాజీ కాంగ్రెస్‌ నేత‌ల విమ‌ర్శ‌లు - ప్ర‌తి విమ‌ర్శ‌ల కార‌ణంగా...ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు తెలంగాణ రాజ‌కీయాల్లో తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ప‌త్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న చలో అసెంబ్లీకి సీఎల్పీ ఉప నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంపై అధికార టీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కౌంట‌ర్ ఇస్తూ కోమ‌టిరెడ్డివి కోతి ప‌నులు అంటూ ఎద్దేవా చేశారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమాన్ని గాలికి వ‌దిలేసి రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని కోమ‌టిరెడ్డి ఆరోపించారు. మూడేళ్ల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల పేరిట 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే - దాంట్లో లక్ష కోట్లు కేసీఆర్‌ కుటుంబమే దోచుకుందని దుయ్య‌బ‌ట్టారు. రైతు స‌మ‌స్య‌లు ప‌ట్టించుకొని కేసీఆర్ స‌ర్కారు తీరుకు నిర‌సన‌గా తాను చ‌లో అసెంబ్లీకి పిలుపునిచ్చిన‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండిప‌డ్డారు. కోమ‌టిరెడ్డి అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారని ఎంపీ గుత్తా స్పష్టం చేశారు. సీఎం రైతు పక్షపాతి అని తేల్చిచెప్పారు. అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే రైతు సమన్వయ సమితుల ఏర్పాటు అని పేర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి ఛలో అసెంబ్లీ డ్రామా ఆడుతున్నారని గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. వ్యవసాయం అంటే తెలియని కోమటిరెడ్డి రైతులపై ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. కోమ‌టిరెడ్డి కోతి చేష్ట‌ల‌ను రైతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రతిపక్షాలు చులకన అవుతున్నాయన్నారు. జిల్లాలో 18 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు రవాణా భారం కాకుండా జిన్నింగ్ మిల్లులు ఉన్న చోట సీసీఐ కేంద్రాలు తెరిచామని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తెలిపారు.కోమటిరెడ్డిని రైతులు నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ గుత్తా అన్నారు.