Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిలో తెగ తాగేస్తున్నారు బాసు!

By:  Tupaki Desk   |   30 July 2016 4:15 AM GMT
ఏపీ రాజధానిలో తెగ తాగేస్తున్నారు బాసు!
X
నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేసిన తరువాత రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు - రాజధానికి రెండో వైపు ఉన్న కృష్ణా జిల్లాల అభివృద్ధి మాములుగా ఉండదని అంతా భావించారు. బాబు చెప్పినట్లు, జనం కోరుకున్నట్లు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని కలలు కన్నారు. ప్రస్తుతానికి అవేవీ ఇంకా జరగకపోయినా... రాజధానికి ప్రకటన అనంతరం భూముల రేట్లు మాత్రం ఆకాశానికి చేరాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకుంటే... మరో కొత్త విషయం తాజాగా తెలిసింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు - ఆరు కాయలుగా అభివృద్ధిచెందుతుందట.

తాజాగా లెక్కల ప్రకారం కృష్ణా - గుంటూరు జిల్లాల్లో మద్యం అమ్మకాలు అమాంతం పెరిగాయి. గత ఐదేళ్ల రికార్డులను పరిశీలిస్తే గడిచిన రెండేళ్లుగా ఈ రెండు జిల్లాల్లో లిక్కర్‌ వినియోగం అమాంతం పెరిగింది. ముందుగా గుంటూరు జిల్లా సంగతి పరిశీలిస్తే... 2014-15లో మద్యం విక్రయాల వృద్ధిరేటు 3.85గా ఉంటే... 2015-16కి 12.35 శాతానికి పెరిగింది. కృష్ణాజిల్లాలో 2013-14 లో మద్యం వినియోగం వృద్ధిరేటు 1%గా 2014-15తో 0.84%గా ఉంటే.. 2015-16లో మాత్రం ఏకంగా 10.02 శాతానికి పెరిగింది. ఈ ఒక్క వివరం చాలు ఏపీ రాజధానికిలో మధ్యం వినియోగం ఎలా ఉందో చెప్పడానికి.

రాజధాని ప్రకటన అనంతరం ఈ రెండు జిల్లాల్లో డబ్బులు ఎక్కువగా చెలామణి అవడంతో మద్యం విక్రయాలు కూడా బాగా పెరిగాయని అంటున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో రాజధాని నిర్మాణం జరగలేదు, ఉద్యోగులు కూడా ఇంకా పూర్తిగా అమరావతికి చేరలేదు.. అయినా కూడా అమ్మకాలు ఈ రేంజ్ లో అభివృద్ధి సాధిస్తే... ఇక పూర్తిస్థాయిలో రాజధాని నిర్మాణం జరిగి, ఉద్యోగులు కూడా పూర్తిగా అమరావతికి వచ్చేస్తే.. రికార్డులు తిరగరాసేస్తారేమో!!