Begin typing your search above and press return to search.

ప్ర‌కాశం టీడీపీలో ఫైటింగ్‌

By:  Tupaki Desk   |   1 Oct 2016 9:58 AM GMT
ప్ర‌కాశం టీడీపీలో ఫైటింగ్‌
X
రాష్ట్రంలో అధికార ప‌క్షానికి వేరే ప్ర‌తిప‌క్షం అక్క‌ర్లేదేమో అన్న‌ట్టుగా ఉంటి టీడీపీ ప‌రిస్థితి! పార్టీలో అంద‌రూ క‌లిసి మెలిసి ఉండాలని - అంద‌రూ అంద‌ర్నీ కలుపుకొని వెళ్లాల‌ని ప‌దే ప‌దే చంద్ర‌బాబు చెబుతున్నా.. తెలుగు త‌మ్ముళ్ల‌కు మాత్రం బాబు మాట‌లు ఎక్క‌డా చెవికెక్కుతున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ - ఏ జిల్లాకు ఆ జిల్లాలో త‌మ్ముళ్లు బ‌హిరంగ ఆరోప‌ణ‌ల‌కు దిగుతూ.. ఒక‌రినొక‌రు దూషించుకోవ‌డ‌మే కాకుండా టీడీపీ ప‌రువును న‌డిరోడ్డుకు ఈడుస్తున్నారు. తాజాగా ప్ర‌కాశం జిల్లా టీడీపీలో అసంతృప్తి - వ‌ర్గ పోరు తీవ్ర స్థాయిలో బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా జిల్లాకు గుండెకాయ వంటి మార్కాపురం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌మ్ముళ్ల మ‌ధ్య పోరు పీక్ స్థాయికి చేరింది.

ఈ నియోజ‌క వ‌ర్గంలోని టీడీపీ నేత‌లు రెండు వ‌ర్గాలుగా చీలి పోయి ఒక‌రిపై ఒక‌రు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునే స్థాయికి చేరారు. అంతేకాకుండా.. ఒక‌రిపై ఒక‌రు మీడియా గొట్టాల ముందు విమ‌ర్శ‌లు కూడా చేసేసుకుంటున్నారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో చ‌ర్చ‌కు దారితీసింది. మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జ్ కందుల నారాయణరెడ్డి వ‌ర్గం ఆగ‌డాలు శృతి మించాయ‌ని... టీడీపీకే చెందిన మ‌రో వ‌ర్గం ఆరోపిస్తోంది. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ఏక‌ప‌క్షంగా నిర్వ‌హిస్తున్నార‌ని, ప్ర‌తి ప‌నికీ ఇంత‌ని క‌మీష‌న్ గుంజుతున్నార‌ని, ఇదేమ‌ని అడిగే నాథుడే లేకుండా పోయాడ‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

ప్ర‌శ్నిస్తున్న త‌మ‌పై దౌర్జ‌న్యానికి కూడా కందుల వ‌ర్గం సిద్ధ‌మ‌వుతోంద‌ని రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాథ్ - పార్టీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం - తర్లుపాడు సర్పంచ్ కందుల విజయ కళావతిల వ‌ర్గం మీడియా ముందు ఆరోపించింది. గ‌త కొన్నాళ్లుగా జ‌రుగుతున్న ఈ భాగోతంపై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు - సీఎం చంద్ర‌బాబు - పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ ల‌కు వివ‌రించామ‌ని కూడా చెప్ప‌డాన్ని బట్టి విష‌యం ఏ రేంజ్‌కి చేరిందో తెలుస్తూనే ఉంది. 15 ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి - కందుల విజయానికి తోడ్పడ్డామని, అయితే కొందరు నాయకులు చేస్తున్న అవినీతి - అక్రమాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోంద‌ని ప‌రోక్షంగా కందుల‌పై విరుచుకుప‌డ్డారు.

నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అవినీతిని నిల‌దీయ‌డంతో మార్కెట్ యార్డు చైర్మన్ డీవీ కృష్ణారెడ్డి - పట్టణ పార్టీ అధ్యక్షుడు గుప్తా ప్రసాద్ - చైర్మన్ భర్త వక్కలగడ్డ మల్లికార్జున్ - తాళ్లపల్లి సత్యనారాయణ... త‌మ‌పై చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికైనా స్పందించి స‌మ‌న్వ‌య క‌మిటీ వేసి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌న్నారు. ఈ నెల 21లోపు పరిస్థితిని చక్కదిద్దకపోతే 2000 మందితో మార్కాపురం నుంచి విజయవాడలోని సీఎం చంద్రబాబు ఇంటి వరకు పాదయాత్ర చేపడతామని అన్నారు. దీనిని బ‌ట్టి ప‌రిస్థితి ఎంత వ‌ర‌కు వెళ్లిందో అర్ధం అవుతోంది! మ‌రి ఈ త‌మ్ముళ్ల‌ను చంద్ర‌బాబు ఎలా దారికి తెస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/