Begin typing your search above and press return to search.

మోడీ కొత్త స్కీంతో ముస్లిం అమ్మాయిలు ఫిదా

By:  Tupaki Desk   |   13 Oct 2017 12:10 PM GMT
మోడీ కొత్త స్కీంతో ముస్లిం అమ్మాయిలు ఫిదా
X
ముస్లిం మ‌హిళ‌ల సంక్షేమం కోసం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కంక‌ల‌ణం క‌ట్టుకున్ట‌న్లుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ట్రిపుల్ త‌లాక్‌ ను నిషేధించి మైనార్టీ మ‌హిళ‌ల్లో మైలేజీ సంపాదించిన మోడీజీ తానాగా మైనార్టీ బాలిక‌ల కోసం మ‌రో స్కీం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. డిగ్రీ పూర్తి చేసిన ముస్లిం యువతులకు రూ.51 వేల కానుక ఇస్తూ మోదీ ప్రభుత్వం కూడా ముస్లిం యువతుల కోసం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చేసిన ఈ ప్రతిపాదనను మైనారిటీ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. షాదీ శగున్ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

మైనారిటీలలో ఉన్నత చదువులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రారంభించారు. బేగమ్ హజ్రత్ మహల్ అంటే మౌలానా ఆజాద్ ఫౌండేషన్ అందించే స్కాలర్‌ షిప్‌ కు అర్హత సాధించినవాళ్లంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో పన్నెండో తరగతి వరకు ముస్లిం బాలికలకు నెలవారీ స్టైఫండ్లు ఇచ్చేవాళ్లు. అయితే దీనిని డిగ్రీ వరకు పొడిగించాల్సిందిగా కోరుతూ ఓ ప్రతిపాదనను ఈ ఏడాది జులైలో మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వికి పంపించారు. షాదీ శగున్ పథకం వివరాలను మౌలానా ఆజాద్ ఫౌండేషన్ తమ వెబ్‌ సైట్‌ లో ఉంచనుంది. ప్రస్తుతం బేగమ్ హజ్రత్ మహల్ స్కాలర్‌ షిప్‌ కు అదనంగా ఈ షాదీ శగున్ ఇవ్వనున్నారు. ఆరు మైనారిటీ సామాజిక వర్గాలైన ముస్లిం - క్రిస్టియన్ - సిక్కులు - బౌద్దులు - జైనులు - పార్శీలకు ఈ మెరిట్ స్కాలర్‌ షిప్ అందిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల ఏడాది సంపాదన 2 లక్షలు దాటిన వారికి ఈ స్కాలర్‌ షిప్ ఇవ్వరు. ఆడపిల్లల పెళ్లి కోసం డబ్బు దాచి వాళ్లను చదువులను మధ్యలోనే ఆపేయొద్దనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించినట్లు మైనారిటీ శాఖ తెలిపింది.

కాగా, ట్రిపుల్ త‌లాక్‌ కు వ్య‌తిరేకంగా గళం విప్పి కేంద్ర ప్ర‌భుత్వం ద్వారా అధికారికంగా ఈ దురాచారం దూర‌మ‌య్యేందుకు కృషిచేయ‌డం ద్వారా మోడీజీ మైలేజీ సంపాదించిన సంగ‌తి తెలిసిందే. కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మ‌హిళా ఓట‌ర్లు బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికారు. ఈ ఎపిసోడ్‌ లో మోడీజీ మ‌రో ప్ర‌జాకర్ష‌క స్కీంకు శ్రీ‌కారం చుట్టార‌ని అంటున్నారు.