Begin typing your search above and press return to search.

విపత్తును దేవుడి ఖాతాలో వేసిన గవర్నర్

By:  Tupaki Desk   |   26 Sep 2016 7:24 AM GMT
విపత్తును దేవుడి ఖాతాలో వేసిన గవర్నర్
X
రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఈఎస్ఎల్‌ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కురుస్తున్న అతి భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర‌ ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా అందరి కంటే ఎక్కువగా ప్రభావితమైంది మాత్రం హైదరాబాద్ మహానగర ప్రజలే. భారీగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోనే కాదు.. ఎప్పుడూ వరద నీరు వస్తుందన్న ఆలోచన లేని ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరటం.. వందలాది అపార్ట్ మెంట్ సెల్లార్లు పూర్తిగా మునిగిపోయిన వైనం తెలిసిందే.

రోజులు గడుస్తున్నా వర్షపు నీటిలోనే ఉండి పోయిన అపార్ట్ మెంట్లు.. వరద నీటిని సకాలంలో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయలేదని.. విపత్తు వేళ తెలంగాణ సర్కారు స్పందన ఏ మాత్రం బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. గవర్నర్ గళం విప్పారు. ఆయన మాటల్లో కేసీఆర్ సర్కారుకు క్లీన్ చిట్ ఇవ్వటమే కాదు.. విపత్తు దేవుడి ప్రసాదంగా వ్యాఖ్యానించిన ఆయన.. ప్రభుత్వానికి ఈ ఇష్యూలో ఎలాంటి బాధ్యత లేదని సర్టిఫికేట్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

నగరాల్లో చెరువుల్ని ఆక్రమించుకొని భవనాలు నిర్మించటం.. నల్లాల్ని ఆక్రమించుకోవటం వల్లనే ఇళ్లు మునిగిపోయినట్లుగా వ్యాఖ్యానించిన గవర్నర్ మాటల మీద తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. గవర్నర్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. శనివారం కేసీఆర్ మీడియాతో మాట్లాడిన మాటల్ని టీవీలో శ్రద్ధగా తిలకించినట్లుగా కనిపిస్తోంది. అక్రమ కట్టడాల నిర్మాణంలో ప్రజలదే బాధ్యత అయితే.. వాటికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? చూసీ చూడనట్లుగా వ్యవహరించింది ఎవరు? ఈ రోజు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేసరికి.. బాధ్యత ప్రజల మీద బదలాయించే ప్రభుత్వాలు.. అక్రమ కట్టడాల మీద ఇంతకాలం చేసిందేమిటి?

గవర్నర్, ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ప్రజలే తప్పు చేశారని అనుకుందాం. మరి.. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎందుకు మునిగిపోయినట్లు? జనాల్ని తిట్టేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన ప్రసంగంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు సైతం నల్లాల మీద నిర్మించారన్న మాట చెప్పటాన్ని మర్చిపోకూడదు. విపత్తు దేవుడి ప్రసాదంగా చెప్పే గవర్నర్.. మరి ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిన ప్రభుత్వాల పాత్రేమిటి? దేవుడు పరీక్షలు పెడుతుంటే ప్రజలు మాత్రం బాధ్యత వహించాలా? అలాంటప్పుడు పాలకులు ఎందుకు? వారి పాత్ర ఏమిటి? క్రెడిట్ తీసుకోవటానికి ప్రభుత్వాలు ఉంటాయా? డెబిట్ అన్నది అస్సలు తీసుకోవా? తాజా విపత్తు సందర్భంగా మునిగిన అపార్ట్ మెంట్ల విషయానికి వస్తే.. దీనికి కారణంగా ప్రభుత్వం.. అధికారులు.. బిల్డర్లు తప్పించి ప్రజలు ఏ మాత్రం కాదనే చెప్పాలి.

అధికారులు అనుమతులు ఇవ్వకుంటే ఇలాంటి భవనాల నిర్మాణమే జరిగేది కాదు. ఒకవేళ అధికారులు అనుమతులు ఇచ్చినా.. ప్రభుత్వం కన్నెర్ర చేసి అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటే మరొకరు తప్పులు చేసేందుకు సాహసించే వారు కాదు. ఇక.. అక్రమ కట్టడాలు కట్టిన బిల్డర్లపై కొరడా ఝుళిపించినా.. లేదంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకున్నా ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదు కదా. వ్యవస్థలో ఇంతమంది చేసిన తప్పుల్ని వదిలేసి.. తాజా విపత్తులో దారుణంగా దెబ్బ తిన్న సామాన్యుడ్ని టార్గెట్ చేయటం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం?

ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం చెప్పిన మాటల్నే మరోసారి గుర్తు చేసుకుంటే.. అవినీతి అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆఫీసర్ల మీద చర్యలు మొదలు పెడితే.. బల్దియాలో ఒక్క అధికారి కూడా మిగలరని చెప్పటాన్ని మర్చిపోకూడదు. అంతగా అవినీతి గబ్బున్న అధికారులు.. వారి దన్నుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే బిల్డర్లు ఉన్నప్పుడు.. పరిమిత అవగాహన ఉన్న సామాన్యుడు అంతిమంగా బాధ్యత మోయటం ఏమిటి? డబ్బులు పోగొట్టుకొని మరీ నిందలు పడటం ఏమిటి? ఇలాంటివేమీ గుర్తించకుండా గవర్నర్ స్థాయిలో ఉన్నోళ్లు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఏమిటి..?