Begin typing your search above and press return to search.

టీడీపీలోకి గౌరు చరితారెడ్డి?

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:07 PM GMT
టీడీపీలోకి గౌరు చరితారెడ్డి?
X
పొలిటికల్ బయోపిక్‌ లలో సూపర్‌ హిట్‌ గా నిలిచిన యాత్ర సినిమాలో ఒక సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాలో నటించిన యాంకర్ అనసూయ రాజశేఖరరెడ్డి పాత్రధారి మమ్ముట్టి వద్దకు వచ్చి సహాయం అర్ధిస్తుంది.. ఆమెకు సహాయం చేయొద్దని, ఆమె తండ్రి తమకు వ్యతిరేకంగా పనిచేశారని అనుచరులంతా చెప్తారు. కానీ, అప్పటికే మాటిచ్చిన మమ్ముట్టి(రాజశేఖరరెడ్డి) ఆమెకు అండగా నిలిచి టిక్కెటిస్తారు. తనకు వ్యతిరేకంగా పనిచేసినా సహాయం కోరి వస్తే రాజశేఖరరెడ్డి ఎలా సహాయం చేస్తారన్నదానికి నిదర్శనంగా చూపిన ఆ సన్నివేశం ఆ సినిమాకు ప్రాణం పోసిన సన్నివేశాల్లో ఒకటి. సెంటిమెంటు పండించిన ఆ సన్నివేశంలో యాంకర్ అనసూయ పాత్ర నిజజీవితంలో గౌరు చరితారెడ్డిదని చెబుతారు. ఇప్పుడా గౌరు చరితారెడ్డి కుటుంబం వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత గౌరు చరితకు రాజశేఖరరెడ్డి అంటే అభిమానమే. ప్రస్తుతం ఆమె, భర్త వెంకటరెడ్డిలు వైసీపీలోనే ఉన్నారు. అయితే.. రానున్న ఎన్నికల్లో పాణ్యం టీడీపీ టిక్కెట్ ఇస్తామని టీడీపీ నుంచి ఆఫర్ రావడంతో వారిప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలే వారిని పార్టీమారేలా చేస్తున్నాయంటున్నారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు భావిస్తున్నారట. పైగా వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్ ను గౌరు చరితకు ఇస్తానని జగన్ ఇంతవరకు హామీ ఇవ్వలేదట. గౌరు చరిత వైసీపికి రాజీనామా చేసి వచ్చే నెల 6వ తేదీన తన భర్తతో పాటు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.

ఇదే నిజమైతే... టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరుగుతు‌న్న వేళ ఇలా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీలోకి వెళ్లడం జగన్‌కు ఇబ్బందికర పరిణామమే.