Begin typing your search above and press return to search.

స్వీట్ న్యూస్‌..30 లక్ష‌ల ఐటీ ఉద్యోగాలు వ‌స్తాయ్‌

By:  Tupaki Desk   |   24 May 2017 5:11 AM GMT
స్వీట్ న్యూస్‌..30 లక్ష‌ల ఐటీ ఉద్యోగాలు వ‌స్తాయ్‌
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం తిరోగమనంలో పయనిస్తుందన్న ఆందోళనలు స‌ర్వ‌త్రా వ్యక్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఐటీ రంగంపై ఆశ‌లు వ‌దులుకోవ‌డ‌మే ఉత్త‌మం అన్న‌ట్లుగా ప‌రిస్థితులు మారిపోయిన‌ట్లు కూడా కొంద‌రి మాట. అయితే దీన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొట్టి పారేశారు. అంతేకాదు పెద్ద తీపి క‌బురు అందించారు. అదేంటంటే.. 2025కల్లా ఐటీ ఇండస్ట్రీ 25-30 లక్షల ఉద్యోగాలు కల్పించనుందట‌. ఇదే విష‌యాన్ని మంత్రి తెలిపారు.

ఎన్డీఏ సర్కారు మూడేళ్ల పాల‌న‌లో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ చేపట్టిన చర్యలు, సాధించిన విజయాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ``దేశీయ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉపాధికల్పన తిరోగమనంలో ఉందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా తిరస్కరిస్తున్నాను. ఇండస్ట్రీ పునాదులింకా గట్టిగానే ఉన్నాయి. మున్ముందు భారీ వృద్ధి నమోదు చేసుకోనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నాక ఐటీ రంగ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. దేశీయ ఐటీ రంగం ప్రత్యక్షంగా 40 లక్షల మందికి, పరోక్షంగా 1.3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇండస్ట్రీ ఎగువ ముఖంగానే పయనిస్తోంది. వచ్చే నాలుగైదేళ్ల‌లో ఐటీ రంగం 20-25 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని నాస్కామ్ అంచనా వేస్తోంది కూడా!`` అని రవిశంకర్ ప్రసాద్ వివ‌రించారు. గడిచిన మూడేళ్ల‌లో ఐటీ కంపెనీలు 6 లక్షల ఉద్యోగాలు కల్పించాయన్నారు.


ఇదిలాఉండ‌గా, ఐటీ రంగ ఉద్యోగులకు చెందిన ది ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ (ఎఫ్‌ఐటీఈ).. దేశీయ టెకీల తొలి ఉద్యోగ సంఘంగా తన పేరును అధికారికంగా రిజిస్టర్ చేసుకోనుంది. ఇండియాలో పనిచేసే ఐటీ ఉద్యోగుల తొలి యానియన్‌గా ఎఫ్‌ఐటీఈ పేరు నమోదు చేసుకోనుంది అని ఫోరం వైస్ ప్రెసిడెంట్ వాసుమతి తెలిపారు. ఐదు నెలల్లోగా ఉద్యోగ సంఘం ఏర్పాటు లాంఛనాలు పూర్తికానున్నాయని ఆయన చెప్పారు. బడా ఐటీ సంస్థలు భారీ సంఖ్యలో సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ రంగానికి ప్రత్యేక ఉద్యోగ సంఘం ఏర్పాటు అవుతుండటం గమనార్హం. ఎఫ్‌ఐటీఈలో 1000 మందికి పైగా సభ్యులున్నారు. 100 మంది యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ ఫోరం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె, ముంబై, కొచి, ఢిల్లీతోసహా మొత్తం 9 నగరాల్లో శాఖలను ఏర్పాటు చేసుకుంది.