Begin typing your search above and press return to search.

500 కోట్ల అవినీతి జ‌ల‌గ‌...ఎన్నిక‌ల్లో పోటీ

By:  Tupaki Desk   |   9 Oct 2017 7:39 AM GMT
500 కోట్ల అవినీతి జ‌ల‌గ‌...ఎన్నిక‌ల్లో పోటీ
X
ఏసీబీ చరిత్ర‌లోనే రికార్డు స్థాయి అవినీతి జ‌ల‌గ అనే ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరక్టర్‌ గోళ్ల వెంకట రఘు విష‌యంలో మ‌రో సంచ‌ల‌నం తెర‌మీద‌కు వ‌చ్చింది. పదవీ విరమణకు ఐదు రోజులు ముందు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ర‌ఘు త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌న‌ను చాలా ప‌క్కాగా సిద్ధం చేసుకున్నాడ‌ట‌. అదే రాజకీయ అరంగేట్రం. నేతల్ని మంచి చేసుకోవడంలో ముందుండే రఘు తన అక్రమ సంపాదనలో కొంత భాగాన్ని అవినీతి నేతలకు కూడా ఇస్తూ దశాబ్దాలుగా అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. అయితే ఇంకెన్ని రోజులు ఇలా నేత‌ల‌కు సొమ్ములు ఇవ్వాల‌ని భావించి...రాబోయే ఎన్నికల్లో గుంటూరు లేదా విశాఖ జిల్లాలలో ఎమ్యెల్యేగా పోటీ చేయాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ టికెట్ ఎలా సంపాదించ‌డం? ఆయ‌న‌కు అండ‌గా నిలిచిన నాయ‌కులు ఎవ‌రు? అనే సందేహానికి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు వ‌స్తున్నాయి.

త‌న ఉద్యోగ ధ‌ర్మాన్ని ప‌క్క‌న‌పెట్టి అంతులేని అవినీతితో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ర‌ఘు రాష్ట్రంలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకునికి బినామీగా ఉన్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రస్తుతం బినామీగా ఉన్నప్ప‌టికీ మ‌రింత కిక్ కోసం భవిష్యత్తులో తానూ ప్రజా ప్రతినిధిగా మారడానికి పక్కాగా ప్లాన్‌ చేసుకున్నాడని స‌మాచారం. తన అవినీతికి రాజకీయం తోడైతే ఇక ఎదురుండదని భావించాడని...అందుకే పదవీ విరమణ తరువాత రాజకీయాలు - వ్యాపారాలను రెండు కళ్లుగా చేసుకోవాలని కలలుకన్నాడని అంటున్నారు. తనకున్న పరిచయాల ద్వారా రాజకీయంగా ఎదిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తవని భావించాడు. అందుకే తానే పోటీ చేయాల‌ని భావించిన ర‌ఘు... దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని కొందరు ప్రముఖ రాజకీయ నేతలతో ముందస్తు మంతనాలు జరిపినట్లు సమాచారం.

మ‌రోవైపు రాష్ట్ర విభజన తరువాత కూడా రఘు అక్రమాలకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ సిటీ ప్లానర్‌ గా రఘు పని చేస్తున్నప్పుడే అనధికార అనుమతులకు సంబంధించి ఆయన చేసిన అవినీతిపై విజిలెన్స్‌ అధికారులు కేసు నమోదు చేశారు. అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో రఘుతో పాటు సహోద్యోగి డి వెంకటేశ్వరరావు - మరో ముగ్గురిపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రఘు మినహా మిగిలిన నలుగురు ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు వారిపై చర్యలు నిలిపేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరులో తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, విజిలెన్స్‌ కేసునుండి తనను విముక్తి చేయాలని రఘు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఎసిబి అధికారులు దాడులు చేయడానికి ఐదు రోజులు ముందు అంటే సెప్టెంబర్‌ 21న రఘుపై చర్యల్ని నిలిపేస్తూ ప్రభుత్వం జీఓ 662ను విడుదల చేసింది. ఈ జీఓ జారీ వెనుక ఒక మంత్రి ఒత్తిడి ఉన్నట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఆ మంత్రి ఎవ‌ర‌నేది హాట్ టాపిక్‌ గా మారింది.

మ‌రోవైపు రఘు మూడు రోజుల ఏసీబీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో అధికారులకు ఏ మాత్రం సహకరించలేదని సమాచారం. అధికారులు ఎటువంటి ప్రశ్నలడిగినా తెలియదు - కాదు అనే సమాధానం మినహా మరేమీ చెప్పనట్లు తెలుస్తోంది. తనకు ఆరోగ్యం బాగాలేదని, తనను ఇబ్బంది పెట్టొద్దని, తనకు ఏదైనా అయితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని బెదిరింపు ధోరణిలోనూ మాట్లాడినట్లు సమాచారం. ఏదేమైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విచారణలో రఘు నుంచి కీలక సమాచారాన్ని రాబడితే వేల కోట్ల రూపాయిల అక్రమ ఆస్తుల సమాచారం బయటకు వస్తుందని ఆ శాఖకు చెందిన ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఏసీబీ దాడుల్లో సుమారు రూ.500 కోట్లు అక్రమాస్తులు బయట పడినా వాస్తవానికి అంతకు నాలుగు రెట్లు అతని అవినీతి సంపాదన ఉంటుందని సొంత శాఖకు చెందిన ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు.