Begin typing your search above and press return to search.

కేరళ అయిపోయింది.. ఇక గోవా వంతు!

By:  Tupaki Desk   |   19 Aug 2018 12:38 PM GMT
కేరళ అయిపోయింది.. ఇక గోవా వంతు!
X
అయ్యో పాపం.. కేరళ.ఈ మాటే ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా వినిపిస్తోంది.గత పదిరోజులుగా ఈ విపత్తు వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200లకు చేరింది. ఈ వర్షాకాల సీజన్‌ లో ప్రకృతి బీభత్సానికి మొత్తం 357 మంది మరణించారు. భారీ వర్షాలు - వరదలతో 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అయితే ఈ ప‌రిణామం గురించి మ‌రో సంచ‌ల‌న వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవ‌డం వ‌ల్లే కేరళకు ఈ పరిస్థితి ఎదుర‌వుతోంద‌ని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ వ్యాఖ్యానించారు. ఏడేళ్ల కిందటే హెచ్చరించిన గాడ్గిల్ మరో హెచ్చరిక జారీ చేశారు. పర్యావరణ పరంగా తగిన చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు కేరళకు పట్టిన గతే గోవాకు కూడా పడుతుందని గాడ్గిల్ స్పష్టంచేశారు.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో మాధ‌వ్ గాడ్గిల్ ఇచ్చిన నివేదిక చ‌ర్చ‌నీయాంశం అయింది. కొన్నేళ్ల కిందట పశ్చిమ కనుమలపై అధ్యయనం చేసిన కమిటీకి మాధవ్ గాడ్గిలే నేతృత్వం వహించారు. అప్పుడే కేరళకు పొంచి ఉన్న ముప్పును ఆయన అంచనా వేశారు. మిగతా రాష్ర్టాలలాగే గోవా కూడా అంతులేని లాభాపేక్షతో చేయకూడని పనులను చేస్తున్నదని గాడ్గిల్ అన్నారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరంగా అన్ని రకాల సమస్యలు మొదలవుతున్నాయి. కేరళలో ఉన్న స్థాయిలో పశ్చిమ కనుమలు గోవాలో లేకపోయినా.. ఆ రాష్ర్టానికి కూడా ముప్పు తప్పదు అని గాడ్గిల్ హెచ్చరించారు. అంతులేని లాభాపేక్ష కారణంగానే ఎవరూ పర్యావరణంపై దృష్టి సారించడం లేదని ఆయన స్పష్టంచేశారు. గోవాలో అక్రమ మైనింగ్ ద్వారా 35 వేల కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎంబీ షా కమిషన్ తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా గాడ్గిల్ గుర్తుచేశారు. ఇలా అక్రమంగా డబ్బు సంపాదించినవాళ్లు ఆ డబ్బుతోనే మరిన్ని చట్టవిరుద్ధ పనులు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు సంపాదిస్తున్నారని గాడ్గిల్ తెలిపారు.

అంతేకాదు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ ను సరిగా పనిచేయకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కూడా ఆరోపించారు. 2011లోనే గోవాలో జరుగుతున్న ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా అక్కడి పర్యావరణంపై గాడ్గిల్ అధ్యయనం చేశారు. అయితే ఆ సంస్థలు తమకు తప్పుడు నివేదికలు అందించాయని అప్పుడే ఆయన విమర్శించారు. అన్ని నివేదికల్లోనూ ఇలాంటి తప్పుడు స్టేట్‌ మెంట్లే రికార్డయ్యాయని గాడ్గిల్ చెప్పారు. అటవీయేతర పనుల కోసం వాడుతున్న ప్రాంతాల్లో మైనింగ్ - క్వారీయింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని 2011లోనే తన నివేదికలో గాడ్గిల్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు.పర్యావరణాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదని ఆయన స్పష్టంచేశారు.