Begin typing your search above and press return to search.

క‌న్న‌డ సీన్‌ తో టీకాంగ్రెస్‌ లో కొత్త నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   20 May 2018 8:08 AM GMT
క‌న్న‌డ సీన్‌ తో టీకాంగ్రెస్‌ లో కొత్త నిర్ణ‌యం
X
ఉత్కంఠ భ‌రిత ప‌రిణామాల మ‌ధ్య క‌న్న‌డ ట్విస్ట్‌ కు ముగింపు ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ త‌న అధికార‌ పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని చూసి ఆ ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసింది. అయితే ఈ ఎపిసోడ్‌ ను అధ్య‌య‌నం చేసిన కాంగ్రెస్ త‌న త‌ర్వాతి ఆప‌రేష‌న్‌ గా తెలంగాణ‌ను ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత - కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ ను పంపించాలని నిర్ణయం తీసుకుందని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధి కారంలోకి రావాలంటే చురుకైన వ్యూహకర్త తెలంగాణకు అవసరమని పలువురు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్‌ కు కూడా పలువురు నేతలు వివరించినట్లుగా తెలిసింది. తాజా ఎపిసోడ్ నేప‌థ్యంలో కాంగ్రెస్ పెద్ద‌లు ఈ నిర్ణ‌యానికి సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిందని కాంగ్రెస్‌ వర్గాల స‌మాచారం. కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను కాంగ్రెస్‌ కు అనుకూలంగా మల్చడంలో ఆజాద్‌ కీలకంగా మారడమే కాకుండా బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా పావులు కదిపారు. అంతేకాకుండా గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు ఆజాద్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జీగా పని చేశారు. రాష్ట్రంలోని సీనియర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎలాంటి గ్రూప్‌ లు లేకుండా చేయడంలో విజయం సాధించారని అంటున్నారు. దీంతో రెండు పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని పలువురు నేతలు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాలంటే ఆజాద్‌ సేవలు రాష్ట్రానికి అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గా రామచంద్ర కుంతియా కొనసాగుతున్నప్పటికీ ముఖ్యనేతల మధ్య ఉన్న విబేధాలను చక్క దిద్దడంలో కొంత ఇబ్బంది పడుతున్నారని పార్టీ హైకమాండ్‌ గుర్తించినట్లుగా సమాచారం. సీనియర్లలో నెలకొన్న విభేదాలను చక్కదిద్దడంతో పాటు - కాంగ్రెస్‌ ను వీడి వివిధ పార్టీల్లోకి వలస వెళ్లిన వారిని కూడా వెనక్కి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని పార్టీ హైకమాండ్‌ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య సఖ్యత ఉండాలంటే సీనియర్‌ నేత - కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడైన గులాంనబీ ఆజాద్‌ ను తెలంగాణకు పంపించాలనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆజాద్‌ ను రాష్ర్టానికి ర‌ప్పించ‌డం వెనుక మ‌త‌ప‌ర‌మైన ఎత్తుగ‌డ‌లు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ముస్లిం, మైనార్టీల ఓటు గణనీయంగా ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచి ముస్లిం ఓటు బ్యాంక్‌ అండగా ఉండేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ వర్గం ఓట్లు కొంత దూరం కావడమే కాకుండా మజ్లిస్‌ పార్టీ కూడా కాంగ్రెస్‌ కు దూరమైన విషయాన్ని పలువురు కాంగ్రెస్‌ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గా రావడం వల్ల ఆ వర్గం ఓట్లు కూడా కాంగ్రెస్‌ కు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయని పార్టీ లెక్క‌లు వేస్తోంది.