Begin typing your search above and press return to search.

చిరకాల మిత్రులు.. ఈ సీటు కోసం శత్రువులు

By:  Tupaki Desk   |   22 Feb 2019 10:44 AM GMT
చిరకాల మిత్రులు.. ఈ సీటు కోసం శత్రువులు
X
చిరకాల మిత్రులు రాజకీయాలు శత్రువులుగా మారిపోయారు. అన్నా, తమ్ముడు అంటూ అప్యాయంగా పిలుచుకునే నేతలు రాజకీయ భవిష్యత్ కోసం విడిపోయి ఈ ఎన్నికల్లో కొట్లాడబోతున్నారు. భీమిలి నియోజకవర్గం కోసం మంత్రి గంటా, ఎంపీ అవంతి శ్రీనివాస్ పట్టింపులకు పోయి ఇప్పుడు వేరు వేరు పార్టీల తరుఫున పోటీ పడడానికి రెడీ అయ్యారు.

గంటా శ్రీనివాస రావుకు విశాఖ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఆయన కాంగ్రెస్, పీఆర్పీ, టీడీపీలోకి వెళ్లినా తనతోపాటు తన అనుచరులైన అవంతి శ్రీనివాస్, పంచకర్ల, చింతలపూడి వెంకటరామయ్య వంటి నేతలను తీసుకెళ్లి వారికి ఎమ్మెల్యే, ఎంపీ పదవులిచ్చి గెలుపించుకున్నారు. కానీ ఇప్పుడు తనకు సన్నిహితుడైన అవంతి శ్రీనివాస్... గంటా శ్రీనివాస్ రావుపై పోటీకి దిగారు. భీమిలి సీటును వదలనని గంటా అనడం.. అవంతి అలిగి వైసీపీ లో చేరడం సంచలనంగా మారింది.

విశాఖ రైల్వేజోన్ సమీక్షకు అవంతిని ఆహ్వానించకుండా గంటా నిర్వహించిన సమావేశం అవంతి అలకకు కారణమైంది. అప్పటి నుంచి గంటాపై కత్తికట్టిన అవంతి దూరం జరుగుతూ వచ్చారు. ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త స్థానాల్లో పోటీచేసి గెలిచే గంటా ఈసారి భీమిలి టికెట్ ను అవంతికి ఇద్దామనుకున్నారు. సర్వేల్లో గంటా ఓడిపోతాడని తెలియడంతో భీమిలి త్యాగం చేద్దామనుకున్నాడు. కానీ మనసు మార్చుకోవడంతో అవంతి ఊరుకోలేదు. విశాఖ నార్త్ సీటును అవంతికి ఇవ్వడానికి గంటా హామీ ఇచ్చారు. బాబును ఒప్పిస్తానన్నాడు. అయినా వినని అవంతి భీమిలి సీటుకోసం పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయని సమాచారం.

అందుకే ఇక టీడీపీలో గంటా ఉండగా.. తనకు భీమిలి సీటు రాదని తేలడం.. సర్వేల్లో భీమిలీలో గంటా ఓటమి ఖాయమవడం.. అవంతి గెలుపునకు అనుకూలంగా వాతావరణం భీమిలిలో ఉండడంతో వెనుదిరిగి చూసుకోలేదు. వెంటనే ప్రతిపక్ష జగన్ ను కలిసి వైసీపీలో చేరారు అవంతి శ్రీనివాస్. ఇలా భీమిలీ సీటు కోసం చిరకాల మిత్రులు గంటా, అవంతిలు విడిపోయారు. రాజకీయ ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఈ స్నేహితుల పోరాటం రాబోయే ఎన్నికల్లో రసవత్తరంగా మారనుంది.