Begin typing your search above and press return to search.

వెంకయ్యకు ఆ పదవిస్తే ఏపీ మంత్రులకు ఎందుకంత బాధ?

By:  Tupaki Desk   |   17 July 2017 8:51 AM GMT
వెంకయ్యకు ఆ పదవిస్తే ఏపీ మంత్రులకు ఎందుకంత బాధ?
X
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఉప రాష్ర్టపతిగా పంపించాలని బీజేపీ అనుకుంటున్నట్లు వార్తలు రావడంతో ఏపీ నేతలు అప్పుడే స్పందించడం మొదలుపెట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ హఠాత్పరిణామంతో కంగు తిన్నా బాధనంతా మనసులోనే దాచుకున్నారట.. అయితే ఆయన కేబినెట్లోని మంత్రులు మాత్రం తమ బాధను బయటపెడతున్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లనున్నారన్న వార్తలు వింటే తమకెంతో బాధ కలుగుతోందని ఏపీ మంత్రులు గంటా శ్రీనివాస్ - ప్రత్తిపాటి పుల్లారావులు అన్నారు.

వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటేనే రాష్ట్రానికి మేలు చేకూరుతుందని చెప్తున్న ఆ ఇద్దరు మంత్రులు విభజన తరువాత ఏర్పడ్డ సమస్యల పరిష్కారానికి వెంకయ్య ఎంతో చొరవ చూపారని అన్నారు. రాష్ట్రాన్ని ఇంకా సమస్యలు పీడిస్తున్నాయని, వెంకయ్య వంటి వ్యక్తి సేవలు దూరమైతే, సమస్యలు అలాగే ఉండిపోతాయని తెగ బాధపడిపోతున్నారు.

రాష్ట్ర పరిస్థితులపై వెంకయ్యకు ఎంతో అవగాహన ఉందని, అటువంటి వ్యక్తి కేంద్రమంత్రిగా ఉంటేనే లబ్ధి చేకూరుతుందని ప్రత్తిపాటి ఫీలయ్యారు. అయితే... ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను మాత్రం వెంకయ్య ఎందుకు సాధించలేకపోయారో వారు చెప్పలేదు.