Begin typing your search above and press return to search.

దేశ‌మంతటికీ విశాఖ నుంచే గంజాయి!!

By:  Tupaki Desk   |   24 July 2017 6:52 AM GMT
దేశ‌మంతటికీ విశాఖ నుంచే గంజాయి!!
X
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా దేశమంతటికీ విశాఖ ఏజెన్సీ నుంచే గంజాయి సరఫరా అవుతోందన్నది బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించారు. విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, ఎక్సైజ్‌ - డ్రగ్స్‌ కంట్రోల్‌ - పోలీసు - విద్యా శాఖాధికారులతో మంత్రి గంటా డ్రగ్స్‌ వినియోగంపై సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...గంజాయి సరఫరాలో దేశంలోనే పేరొచ్చిందని సీఎం చంద్రబాబు కేబినెట్‌లో సరదాగా వ్యాఖ్యానిస్తూనే దీనిపై సీరియస్‌ గా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.

హైదరాబాద్‌ లో పట్టుబడ్డ డ్రగ్స్‌ వినియోగదారుల్లో 8 - 9 తరగతి విద్యార్థులు ఉండటంతో ఉలిక్కిపడ్డామని మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు అన్నారు. ఈ పరిస్థితి ఏపీలో ఉండరాదని అందుకే తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎక్కువగా పాకెట్‌ మనీ ఇవ్వకుండా, అవసరాలమేరకే ఇవ్వాలని కోరారు. పిల్లల ప్రవర్తనపై టీచర్లతో పాటు తల్లిదండ్రులు దృష్టి పెడితే డ్రగ్స్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్రభుత్వం తరుపున డ్రగ్స్‌ నిషేధంపై ఒక హెల్ప్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబరుతో పాటు ఒక టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరైనా వినియోగించినా, సరఫరా చేసినా వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. చాక్లెట్లు - బిస్కెట్ల రూపంలోనూ డ్రగ్స్‌ అందుబాటులోకి వస్తే వాటిని ఎక్సైజ్‌ - ఇతర డ్రగ్స్‌ కంట్రోల్‌ అధికారులే దృష్టి పెట్టాలన్నారు.

ఇదిలాఉండ‌గా...రైల్వే - రోడ్డు మార్గాల్లో నిఘా అంతంత మాత్రంగా ఉండటంతో అక్రమ రవాణాకు విజయవాడ అనుకూలమైన కేంద్రంగా భావిస్తున్నారు. దీంతో నగరానికి నిత్యం గంజాయి - గుట్కా ఉత్తరాంధ్ర నుంచి భారీగా దిగుమతవుతోంది. సురక్షితంగా గంజాయిని రిసీవ్‌ చేసుకున్న అనంతరం మాఫియా శివారు ప్రాంతాల్లో భద్రంగా నిల్వ చేసుకుని రెండు మూడు రోజుల అనంతరం రిటైల్‌ వ్యాపారస్తులకు చేరవేస్తున్నట్లు సమాచారం. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తమ తనిఖీల్లో సరైన నిఘా పెట్టలేకపోతుండటంతో అక్రమార్కులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.