Begin typing your search above and press return to search.

జగన్ కు మంత్రి గంటా భారీ కౌంటర్

By:  Tupaki Desk   |   5 Oct 2015 10:09 AM GMT
జగన్ కు మంత్రి గంటా భారీ కౌంటర్
X
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ కు మంత్రి గంటా శ్రీనివాసరావు భారీ కౌంటరేశారు. భోగాపురం విమానాశ్రయం భూసేకరణ అడ్డుకుంటున్నది వైసీపీ అని.... రైతులు అడ్డం తిరిగేలా జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శలు కురిపించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయం కావాలో వద్దో జగన్ చెప్పాలన్న ఆయన.... భూమి లేకుండా విమానాశ్రయాన్ని గాల్లో కట్టలేం కదా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూములు సేకరించకుండా విమానాశ్రయం ఎక్కడ నిర్మించాలో జగన్‌ చెప్పాలని ఎద్దేవా చేశారు.

భోగాపురం భూసేకరణ విషయంలో అధికారులు ఏమాత్రం ముందడుగు వేయలేకపోతున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయం కోసం తొలుత రూపొందించిన పథకం ప్రకారం ఎక్కువ మంది రైతుల భూమి పోతుందన్న ఉద్దేశంతో తరువాత దాన్ని మార్చారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు రైతుల భూమి వీలైనంత తక్కువగా ఉండేలా... ప్రభుత్వ భూమే ఎక్కువగా ఉండేలా ప్రదేశాన్ని నిర్ణయించారు. దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే... భూసేకరణ జరపాల్సిన గ్రామాల్లో ప్రజలు మాత్రం తమ ఊళ్లలోకి అధికారులను అడుగుపెట్టనివ్వడం లేదు. ఎక్కడికక్కడ అధికారులను అడ్డుకుంటూ అసలేమాత్రం ముందుకు కదలనివ్వడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక ఊరిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దీని వెనుక వైసీపీ నేతలు.... జగన్ వ్యూహాలు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది.

ఇప్పటికే చంద్రబాబు... ఉత్తరాంధ్ర మంత్రులు కూడా ఈ విషయంలో వైసీపీపై ఆరోపణలు చేయగా తాజాగా గంటా నేరుగా జగన్ ను టార్గెట్ చేసి విమర్శలు కురిపించారు.