Begin typing your search above and press return to search.

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రూ.4వేలు ఇచ్చాం.. కానీ

By:  Tupaki Desk   |   22 Sep 2017 5:19 AM GMT
డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రూ.4వేలు ఇచ్చాం.. కానీ
X
కొంత‌కాలం నుంచి ఏపీ ప్ర‌భుత్వ అవినీతి - నంద్యాల అధికార దుర్వినియోగం గురించి టీడీపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెడుతున్న మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ పై టీడీపీ నేత‌లు ఎదురుదాడికి దిగుతున్నారు. తిమ్మిని బ‌మ్మిని చేసేయ‌డం.. నిజాలు చెబుతున్న వారిపై ఎదురుదాడికి దిగ‌డం.. అబ‌ద్ధాల‌ను కూడా అందంగా చెప్ప‌డం టీడీపీ నేత‌ల‌కు బాగా అల‌వాటు అనే విమ‌ర్శ‌లు వినిపిస్తూనే ఉంటాయి! ఏదైనా అంశం త‌మ‌కు అను కూలంగా లేక‌పోతే.. దానిని వేరే అంశానికి ముడిపెట్టి.. ఎదుటివారిపై బుర‌ద జ‌ల్లేందుకు అధికార పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తార‌నే ఆరోప‌ణ ల‌ను నిజం చేస్తున్నారు. అంతేగాక నంద్యాల ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఇచ్చామ‌నే అంశాల‌ను కూడా ఒప్పేసుకున్నారు!

నంద్యాల ఎన్నిక‌ల స‌మ‌యంలో.. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రూ.4వేలు వేశార‌ని చేసిన ఉండ‌వ‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు.. అధికార పార్టీ నేత‌ల్లో గుబులు పెంచాయి. రాష్ట్రంలో ఎవ‌రికీ వేయకుండా.. కేవ‌లం నంద్యాలలోనే వేయ‌డం వెనుక అర్థ‌మేంట‌ని ప్ర‌శ్నించ‌డంతో.. వారికి స‌మాధానం క‌రువైంది. వాస్త‌వాలు బ‌య‌ట‌కు చెబుతున్న ఉండ‌వ‌ల్లిపై ఇప్పుడు టీడీపీ నేత‌లు దాడికి దిగుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అవినీతితో టీడీపీ గెలిచిందన్న ఉండవల్లిపై టీడీపీ నేత గన్ని కృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలు అకౌంటులో వేయడం ఎన్నికల నియమావళి కిందకు రాదన్నారు. అంతేగాక దీనిని ఎన్నికల కోణంలో చూడొద్దని ఆయన చెప్పారు.

నంద్యాలలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఎన్నికల దృష్టితోనే ఇచ్చారని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. డ్వాక్రా గ్రూపులకు రుణమాఫీ కింద రూ.10 వేలు ఇస్తామని సీఎం చంద్ర‌బాబు గతంలోనే ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా రెండు విడతలుగా రూ.3వేల చొప్పున అందజేశారన్నార‌ని.. మిగిలిన రూ.4 వేలు ఇవ్వడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏముందని ఉండ‌వ‌ల్లికి ఎదురు ప్ర‌శ్న వేశారు. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న సీఎంను విమర్శించడమే ఉండ‌వ‌ల్లి పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీపై అనేక విమర్శలు చేస్తున్న ఉండ‌వ‌ల్లి.. వైయస్ హయాంలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు.