Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్ లో 'గాలి' కలకలం..

By:  Tupaki Desk   |   22 Feb 2019 6:59 AM GMT
ఏపీ పాలిటిక్స్ లో గాలి కలకలం..
X
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఏపీ ఎలక్షన్ వార్ లోకి దిగిపోవాలని కర్ణాటక మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డి డిసైడ్ కావడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే తనకున్న డబ్బు పరిపతిని ఉపయోగించుకొని ఈసారి బళ్లారి శివారు ప్రాంతాలపై తన పట్టునిలుపుకునేందుకు ఏపీ ఎన్నికల్లో గెలవడానికి గాలి స్కెచ్ గీసినట్టు సమాచారం.

అయితే గాలి జనార్ధన్ రెడ్డి నేరుగా ఏపీ ఎన్నికల బరిలో నిలవడం లేదు. తనకు పిల్లనిచ్చిన మామ పరమేశ్వర్ రెడ్డిని ఏపీలో పోటీకి నిలపాలని గాలి భావిస్తున్నారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన కంచుకోటైన బళ్లారిలో కూడా గాలికి అనుకూలంగా గాలి వీయలేదు. తన వర్గాన్ని గెలిపించుకోలేక చతికిలిపడ్డాడు. కానీ ఈసారి ఏపీ ఎన్నికల్లో మాత్రం తన మామను గెలిపించుకోవాలని అన్నీ రెడీ చేస్తున్నాడట గాలి.

గాలి జనార్ధన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మీది కర్నూలు జిల్లానే. గాలికి కర్నూలు జిల్లాలో భారీగా బంధుగణం కూడా ఉంది. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం కాకూమురుకు చెందిన పరమేశ్వర్ రెడ్డి కూతురు అరుణ లక్ష్మీనే గాలి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు గాలి వ్యాపారాలను కూడా మామ పరమేశ్వర్ రెడ్డి చూస్తున్నాడు. కుదిరితే అసెంబ్లీ - లేదా లోక్ సభ టికెట్ కోసం ఏపీ పాలిటికల్ పార్టీలను కోరుతున్నాడట గాలి. తండ్రి పరమేశ్వర్ రెడ్డిని ఏపీ పాలిటిక్స్ లోకి దింపాలని భార్య అరుణ - కూతురు కూడా గాలిపై ఒత్తిడి తీసుకువస్తున్నారట.. దీంతో మామకు హామీ కూడా ఇచ్చాడట గాలి.

మరి గాలి ఈసారి ఏపీలో ఏ పార్టీ నుంచి.. ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయించబోతున్నాడు.? అసెంబ్లీకా.? పార్లమెంట్ కా.? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. గాలి బామ్మర్ధికి - వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమార్తెతో వివాహం జరిపించారు. ఇలాంటి దగ్గరి బంధువులు చాలామంది గాలికి కర్నూలులో ఉన్నారు. దీంతో కర్నూలు జిల్లా నుంచే మామను పోటీచేయించి గెలిపించుకోవాలని గాలి స్కెచ్ గీశారు. ఇటు వైసీపీ నేతలతో బంధుత్వం ఉంది. అలాగే టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డితో కూడా గాలికి చుట్టరికం ఉందట.. దీంతో గాలి తన మామను టీడీపీ నుంచి పోటీచేయిస్తారా. ? లేక వైసీపీ నుంచి చేయిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఎందులో అవకాశం దొరికినా మామను పోటీచేయించి నడిపించడానికి గాలి రెడీ అయ్యారట.. పరమేశ్వర్ రెడ్డి కూడా అటు వైసీపీ - ఇటు టీడీపీ నేతలతో టచ్ లో ఉంటున్నారట.. మామను ఏపార్టీ - ఏ నియోజకవర్గంపై గాలి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

కర్ణాటక పాలిటిక్స్ లో ఇప్పటికే ముద్ర వేసిన గాలి.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లోకి కూడా గాలి చొరబడడంతో ఏం జరుగుతుందన్న ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రాంచంద్రరెడ్డి నాడు విజయం సాధించడం వెనుక గాలి ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగడంతో ఆయనకు ఎదురే ఉండకపోవచ్చు. దీంతో కర్నూలు పాలిటిక్స్ లో ‘గాలి’ కలకలం మొదలైంది.