Begin typing your search above and press return to search.

దొంగ ఓట్ల కోసం బాబు ఎంచుకున్న అడ్డదారి ఇదే

By:  Tupaki Desk   |   25 July 2017 1:12 PM GMT
దొంగ ఓట్ల కోసం బాబు ఎంచుకున్న అడ్డదారి ఇదే
X
ముఖాముఖి తలపడ‌టం తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్రబాబుకు అలవాటు లేదని రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏ ఎన్నికలైనా అడ్డదారుల్లో, దొంగదారుల్లో చంద్రబాబు నడుస్తారని ఎద్దేవా చేశారు. నంద్యాల ఎన్నికల్లోనూ ఇప్పుడు ఇదే దారిలో పోతున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాలలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దాదాపు 15వేల దొంగ ఓట్లను చేర్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆళ్లగడ్డ - పాణ్యం - శ్రీశైలం నుంచి పార్టీ కార్యకర్తలు - సానుభూతి పరుల వివరాలు సేకరించి వారిని నంద్యాల ఓటర్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఇదివరకే ఫిర్యాదు చేశామ‌న్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామ‌ని కోరారు.

అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి తెలిపారు. కాని స్థానికులు కానివారికి - దొంగ ఓట్లు వేయాలనుకునే వారికి అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమేరకు అధికారయంత్రాంగానికి తగిన హెచ్చరికలు జారీచేయాలని కోరుతున్నామ‌న్నారు. ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదని గతంలో అధికారాన్ని సొంతంచేసుకోవడానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన తీరు గాని, ఆ తర్వాత కాలంలో ఆయన విధానాలు కాని.. అన్నీ అడ్డదారులు, దొంగదారులేన‌ని గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి మండిప‌డ్డారు. త‌మ‌ నాయకుడు వైఎస్ జగన్ అలా కాదని తెలిపారు. ప్రజలనుంచి వచ్చిన మనిషి...ప్రజా బలంతో ఎదిగిన మనిషి...సోనియాను ఎదిరించి.. ఇవాళ తనకంటూ.. ప్రజా నాయకుడిగా నిలబడ్డారని శ్రీ‌కాంత్ రెడ్డి వెల్ల‌డించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ప్రజా బలంతో నిలబడగలిగారా? అని ప్రశ్నించారు.

నంద్యాలపైన కాని, రాయలసీమ ప్రాంతంపైన గాని చంద్ర‌బాబుకు ఎలాంటి అభిమానం లేదని గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి తెలిపారు. శ్రీశైలంలో కనీస నీటిమట్ట నిల్వ ఉండేలా ఆనాడు వైఎస్సార్ అనేక జాగ్రత్తలు తీసుకున్నారని గుర్తుచేశారు. కరవు ప్రాంతానికి తాగునీటి ఎద్దడి రాకుండా చూశారని, కానీ ఇవాళ శ్రీశైలంలో కనీస నిల్వలు లేకుండా పోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మచ్చుమర్రి ఎత్తిపోతలను ఆర్భాటంగా ప్రారంభించిన చంద్రబాబు ఇవాళ ఆ ప్రాజెక్టును మూలన పడేశారని ఆరోపించారు. కాంట్రాక్టరుకు బిల్లులు కూడా చెల్లించలేదని, దీంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. చంద్రబాబు చేసింది ప్రచారం తప్ప.. పనులు కాదని శ్రీ‌కాంత్ రెడ్డి అన్నారు. ఓట్లకోసం మతపెద్దలను బెదిరించడం దారుణమ‌ని ఎంతటికైనా చంద్రబాబు తెగ‌బడుతున్నారని మండిప‌డ్డారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని తెలిపారు.

నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య మాట్లాడుతూ నంద్యాల పరిస్థితులను చూసి చంద్రబాబుకు దడ పట్టుకుందని అన్నారు. ఈ ఎన్నికలో ఆయనకు పరాజయం తప్పదని తెలిసి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. బెదిరించి, భయపెట్టి.. ప్రలోభపెట్టాలన్నది చంద్రబాబు ఎత్తుగడ అని అన్నారు. గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు దళితులను అవమానించారని, ఇప్పుడు మత పెద్దలను బెదిరిస్తున్నారని తెలిపారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూములు కాజేస్తున్నా.. చంద్రబాబు పట్టించుకోలేదని ఐజ‌య్య‌ మండిప‌డ్డారు. ఇలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులపై అమానుషాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి చంద్రబాబు ఏ ముఖం పట్టు పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్ర‌శ్నించారు. కేంద్రం లక్ష కోట్లకు పైగా రాష్ట్రానికి ఇచ్చామని చెప్తే... చంద్రబాబు నోరు మెదపడంలేదన్నారు. లెక్కలు చెప్తే గాని ఇవ్వమని కేంద్రం అంటోంది ఇంతకీ... ఆయన నోరు - విప్పుతాడా లేదా? అలాంటి మనిషి.. ఇప్పుడు అభివృద్ధి గురించి కాకి లెక్కలు చెప్తున్నారని మండిప‌డ్డారు. విమానాల్లో తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగంచేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్రజల పన్నులతో రోడ్లేస్తే.. వాటిమీద ప్రజలనే తిర‌గొద్దంటున్నార‌ని....ఇదేమనా చంద్రబాబు సొంత జేబులోనుంచి ఇచ్చిన సొమ్మా అని ఐజ‌య్య ప్ర‌శ్నించారు. నంద్యాల ప్రజలను బాబు తీరును గమనించాలని, సరైన గుణపాఠం చెప్పాలని కోరారు.