Begin typing your search above and press return to search.

గద్దర్ సంచలనం..ఎన్నికల్లో పోటీ చేస్తా

By:  Tupaki Desk   |   15 July 2018 5:06 PM GMT
గద్దర్ సంచలనం..ఎన్నికల్లో పోటీ చేస్తా
X
ఓ వైపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు పార్టీలు రెడీ అవుతుండ‌టం మ‌రోవైపు ముంద‌స్తు సంద‌డి కొన‌సాగుతున్న స‌మ‌యంలో తెలంగాణ రాజ‌కీయాలు హాట్ హాట్‌ గా మారుతున్నాయి. ఇప్ప‌టికే అధికార‌ - ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన శైలిలో ఎన్నిక‌ల‌ను ఎదుర్కునేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా తాజాగా మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.వామ‌ప‌క్షాలకు చెందిన బ‌హుజ‌న లెఫ్ట్ ఫ్రంట్‌ సమావేశానికి హాజ‌రైన గ‌ద్ద‌ర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజ్యాధికారం దిశగా వెళ్లాలనిపిస్తోందని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాట్లు తెలిపారు.

ఎన్నికల సంస్కరణలు - ఆవశ్యకత' అంశంపై ఎస్ వీకేలో నిర్వహించిన బీఎల్ ఎఫ్ రాష్ట్ర సెమినార్‌ లో పాల్గొన్న గ‌ద్ద‌ర్ కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. త‌ను రాజ్యాధికారంవైపు చూస్తున్న‌ట్లు గద్దర్ వెల్ల‌డించారు. తనకు ఇప్పటి వరకు ఓటు హక్కు లేదని - ఇప్పుడు నమోదు చేసుకుంటానని చెప్పారు గద్దర్. దేశం మొత్తం లాల్‌ నీల్ ఐక్యతపై చర్చ జరుగుతోందని, లాల్‌ నీల్ ఐక్యత చూస్తే తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనిపిస్తోందన్నారు. లాల్‌ నీల్ జెండాలతో నూతన పార్లమెంట్ తీసుకురావాల్సి ఉందన్నారు. అంబేద్కర్ విధానం పేరుతో ప్రజలను BJP మభ్యపెడుతోందని విమర్శించారు. లాల్‌ నీల్ ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యమని గద్దర్ తెలిపారు.

కాగా, తెలంగాణలో బీఎల్ ఎఫ్ ప్రభుత్వం వస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ - ప్రజలు ఉత్సాహం చూసిన తర్వాత ఆ విశ్వాసం కల్గుతుందన్నారు. జాతీయ స్థాయిలో ప్రజల జీవితాలపై దాడులు పెరుగుతున్నాయని వాపోయారు. దేశంలో మార్పు, తెలంగాణలో మార్పు రావడం అనివార్యం అన్నారు. ఆ మార్పు రాకపోతే మనం బహుజనులకు ఇచ్చిన సామాజిక న్యాయం అనే నినాదం నినాదంగానే మిగిలిపోతుందని చెప్పారు.