Begin typing your search above and press return to search.

గ‌ద్ద‌ర్ మాటః పారిపోయిన దొర‌లు వ‌చ్చేస్తున్నారు

By:  Tupaki Desk   |   30 May 2016 6:04 AM GMT
గ‌ద్ద‌ర్ మాటః పారిపోయిన దొర‌లు వ‌చ్చేస్తున్నారు
X
ప్రజా గాయకుడు గద్దర్ సుదీర్ఘ కాలం త‌ర్వాత తెలంగాణ‌లోని ప‌రిణామాల‌పై స్పందించారు. మెదక్‌ జిల్లాలోని ఓ వ్య‌క్తిని పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అనే అనుమానంతో నక్సలైట్లు 11ఏళ్ల‌ కిందట కాల్చి చంపారు. అతని సంస్మ‌ర‌ణ వేడుక‌ల సంద‌ర్భంగా కుటుంబాన్ని పరామర్శించి గ‌ద్ద‌ర్ వారికి ధైర్యం నింపారు. ఈ సంద‌ర్భంగా గ‌ద్దర్ మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప‌రిణామాల‌పై స్పందించారు.

అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం అవతరించిందని గ‌ద్ద‌ర్‌ గుర్తు చేశారు. వారి కుటుంబాల‌కు న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. నక్సలైట్ల ఉద్యమాల సమయంలో పట్టణాలకు - విదేశాలకు పారిపోయిన దొరలు మళ్లీ నేడు తిరిగి వస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో తాను ఈ ప్రాంతానికి వచ్చినప్పటికి ఇప్పటికి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏదీ జరగలేదన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను నింపాలనే సంకల్పం మంచిదే అయినా పనుల్లో నాణ్యత లోపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

కేజీ టు పీజీ - సంక్షేమ పథకాల బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. మెద‌క్ జిల్లాలో నిర్మిస్తున్న‌ మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూబాధితులకు రెవెన్యూ ధరల ప్రకారం భూములకు రేటు కట్టిస్తే రైతులు నష్టపోతారన్నారు. ప్రాజెక్టు చుట్టుప‌క్క‌ల‌ ప్రాంతాల్లో ఉన్న అటవీ భూమిని రైతులకిస్తే సాగుచేసుకుంటారని సూచించారు. డబ్బులిస్తే పాలేర్లుగా - జీతగాళ్లుగా మిగిలిపోవాల్సి వస్తుందన్నారు.