Begin typing your search above and press return to search.

40కోట్ల అరుణమ్మ ఆస్తి టీ సర్కారు స్వాధీనం

By:  Tupaki Desk   |   4 Oct 2015 9:47 AM GMT
40కోట్ల అరుణమ్మ ఆస్తి టీ సర్కారు స్వాధీనం
X
తెలంగాణ రాష్ట్ర సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన తెలంగాణ కాంగ్రెస్ మహిళా సీనియర్ నేత.. మాజీ మంత్రి డీకే అరుణకు ఊహించని షాక్ తగిలింది. ఆమెకు చెందినదిగా చెప్పుకునే రూ.40కోట్ల విలువ చేసే భూమిని తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకుంది. జూబ్లీహిల్స్ చౌరస్తాలోని అత్యంత విలువైన 400 గజాల స్థలాన్ని తనదిగా మాజీ మంత్రి డీకే అరుణమ్మ భర్త భరతసింహారెడ్డి తమదిగా చెబుతున్నారు.

దీనిపై నెలకొన్న వివాదంలో భాగంగా కోర్టులో కేసు వేశారు. అయితే.. ఈ స్థలం తమదే అంటూ సొసైటీ కూడా వాదిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా జీహెచ్ ఎంసీ అధికారులు తాజాగా అరుణమ్మ కుటుంబానికి చెందినదిగా చెప్పుకునే భూమిని స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిలింనగర్ వైపునకు వెళ్లే సమయంలో ఎదురుగా కనిపించే పెట్రోల్ బంక్ పక్కనున్న 400 గజాల స్థలాన్ని ఆదివారం ఉదయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు.. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి.. స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలం సొసైటీ లే అవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించి.. దీనికి సొసైటీకి కానీ.. డీకే అరుణ భర్త భరతసింహారెడ్డికి కానీ ఎలాంటి సంబంధం లేదని జీహెచ్ ఎంసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా డీకే అరుణ వర్గీయులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయినప్పటికీ.. వారిని అడ్డుకున్న పోలీసులు.. స్థలాన్ని ప్రభుత్వానికి స్వాధీన ప్రక్రియను మూడు గంటల వ్యవధిలో పూర్తి చేశారు. తెలంగాణ సర్కారు మీద పోరాడుతున్న డీకే అరుణకు ఇదో పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. మరి.. దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో..?