Begin typing your search above and press return to search.

'గ్రేట‌ర్' వెంట‌నే వాయింపు మొద‌లెట్టేశారు

By:  Tupaki Desk   |   11 Feb 2016 10:27 AM GMT
గ్రేట‌ర్ వెంట‌నే వాయింపు మొద‌లెట్టేశారు
X
గ్రేటర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత పుర‌పాల‌క‌ - ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ కేటీఆర్ హైద‌రాబాద్ కోసం ఏ విధంగా రంగంలోకి దిగారో ప్ర‌జ‌ల న‌డ్డివిరిచేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోకి వ‌చ్చే అధికారులు కూడా అంతే వేగంగా అడుగులు వేస్తున్నారు. బ‌ల్దియా ఎన్నికలు ముగియడమే ఆల‌స్యం అన్న‌ట్లుగా గ్రేట‌ర్ ప‌రిధిలో ప్రభుత్వం ప‌న్ను వ‌సూళ్ల ప‌ర్వానికి తెరలేపింది. జీహెచ్‌ ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను - వాటర్‌ బిల్లుల వసూళ్లపై దృష్టి సారించి ఇందుకోసం యుద్ధప్రాతిప‌దిక‌న కార్యాచ‌ర‌ణ రెడీ చేసింది.

గ్రేటర్‌ లో సాధారణంగా జనవరిలోనే ఆస్తిపన్ను బకాయిలపై అధికారులు చర్యలు తీసుకుంటారు. అయితే జీహెచ్‌ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో దీన్ని ప‌క్క‌న పెట్టారు. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే కార్యాచరణ రూపొందించి నగరంలో పౌర సేవలందించే ప్రధాన శాఖలు జీహెచ్‌ ఎంసీ - జలమండలి ఆదాయంపై ప్రభుత్వ‌వ‌ర్గాలు దృష్టి సారించాయి. మార్చి 31వరకు ఆదాయ వనరులను సమకూర్చునేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను - నీటి బకాయిలు - విద్యుత్‌ బిల్లులు మాఫీ లాంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణ‌యం ద్వారా మాఫీలు వర్తించని వారు, వాణిజ్య సంస్థల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు దృష్టిసారించారు.

గతేడాది కేవలం ఆస్తిపన్ను వసూళ్ల ద్వారానే జీహెచ్‌ ఎంసీ రూ.1100కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జీహెచ్‌ ఎంసీ చరిత్రలో ఒక సంవత్సరంలోనే ఇంత భారీ ఆదాయం రావడం విశేషం. ఈ ఏడాది జీహెచ్‌ ఎంసీకి రూ.1,550కోట్ల ఆస్తిపన్ను రావాల్సి ఉండ‌గా ఇప్పటికే రూ.530 కోట్లు వసూళ్లు చేసింది. మార్చి 31 వరకు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా జీహెచ్‌ ఎంసీ అధికారగణం సిద్ధమైంది. రూ.1200లోపు ఆస్తిపన్ను చెల్లించేవారు కేవలం రూ.101 చెల్లిస్తే సరిపోతుందని గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప‌రిధిలోకి వ‌చ్చిన వారు 5.09లక్షల మంది ఉన్నారు. వీరి ద్వారా జీహెచ్‌ ఎంసీకి ప్రతియేటా రూ.87.39కోట్లు ఉండ‌గా ప్ర‌భుత్వ నిర్ణ‌యం వ‌ల్ల కేవ‌లం రూ.5.14 కోట్లే వచ్చే అవకాశముంది. ఇలా ఆస్తిపన్ను తగ్గింపుతో జీహెచ్‌ ఎంసీకి ఆదాయం తగ్గనుంది. మినహాయింపు ఉన్న ఆస్తి పన్నుదారులతోపాటు బకాయిదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసేందుకు అధికారులే ఇళ్ల‌ వద్దకు వెళ్లనున్నారు. ప్రస్తుతం సుమారు ఎనిమిది లక్షల ఆస్తులకు సంబంధించిన పన్ను రావాల్సి ఉందని, ఇప్పటికే పలుమార్లు ఫోన్ల ద్వారా సమాచారమిచ్చిన అధికారులు బకాయిదారులకు నోటీసులు జారీ చేయనున్నారు.

మ‌రోవైపు నగర మురికివాడల్లో నివసించే ప్రజలకు నీటి బకాయిలు మాఫీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరుకాకుండా ఉన్న నీటి బకాయిదారుల నుంచి జలమండలికి ఆదాయం రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నగరంలోని వివిధ డివిజన్ల వారీగా జలమండలికి రావాల్సిన బిల్లులు వందశాతం వసూళ్లు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బిల్లులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయడంతోపాటు అవసరమైతే క్రిమినల్‌ కేసులూ పెట్టాలని, నీటి కనెక్షన్లను తొలగించాలని వాటర్‌బోర్డు అధికారులు నిర్ణయించారు.

మొత్తంగా ఎన్నిక‌లు ముగిసి వారం కూడా తిరక్క ముందే అధికారులు త‌మ బిల్లుల వ‌సూలు కోసం ఇళ్ల ముందుకు రావ‌డం గ్రేట‌ర్ వాసుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.