Begin typing your search above and press return to search.

బ్రేకింగ్:వాజ్ పేయి మ‌హాభినిష్క్ర‌మ‌ణం

By:  Tupaki Desk   |   16 Aug 2018 12:36 PM GMT
బ్రేకింగ్:వాజ్ పేయి మ‌హాభినిష్క్ర‌మ‌ణం
X
రాజకీయ కురువృద్ధుడు - మాజీ ప్రధాని - బీజేపీ సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ (93) కొద్ది సేప‌టి క్రితం కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గురువారం సాయంత్రం వాజ్ పేయి తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. కిడ్నీ సంబంధిత వ్యాధులు - మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు షుగ‌ర్ - చిత్త వైకల్యం (డెమెన్షియా)తో వాజ్ పేయి కొంతకాలంగా బాధపడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 11 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. గ‌త 2 రోజులుగా వెంటిలేట‌ర్ పై ఉన్న వాజ్ పేయి ఆరోగ్యం నేడు మ‌రింత క్షీణించింది. ఉద‌యం నుంచి ఆయ‌న శ‌రీర అవ‌య‌వాలు చికిత్సకు స‌హ‌క‌రించ‌డం లేద‌ని వైద్యులు తెలిపారు. వాజ్ పేయి మృతితో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఎయిమ్స్ వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించి భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. గ్వాలియ‌ర్ లోని వాజ్ పేయి స్వ‌గృహానికి ఆయ‌న మృత‌దేహాన్ని త‌ర‌లించ‌నున్నారు.

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ లో డిసెంబర్ 25 - 1924న వాజ్ పేయి జన్మించారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేసిన వాజ్ పేయి 1957లో బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌ సభ కు ఎన్నికయ్యారు. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వాజ్ పేయి..... 1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా - తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో 2 ఎంపీ స్థానాల‌తో ఉన్న బీజేపీని...1996లో అధికారంలోకి తేవ‌డం వ‌ర‌కు వాజ్ పేయి బీజేపీకి విశేష సేవ‌లందించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో విజ‌యం సాధించిన వాజ్ పేయి ఐదేళ్ల పాటు ప్రధానిగా కొన‌సాగిన తొలి కాంగ్రెసేత‌ర వ్య‌క్తిగా చరిత్ర సృష్టించారు. వాజ్ పేయి సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో ఆయ‌న‌ను గౌరవించింది. 10 సార్లు లోక్‌ సభ ఎంపీగా - 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వాజ్‌పేయీ 2005 తర్వాత అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.