Begin typing your search above and press return to search.

లోకేశ్ స‌మ‌క్షంలో పీత‌ల సుజాత సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   19 July 2018 6:08 AM GMT
లోకేశ్ స‌మ‌క్షంలో పీత‌ల సుజాత సంచ‌ల‌నం
X
తొంద‌ర‌పాటు ఏ మాత్రం మంచిది కాదు. కానీ.. ఆ విష‌యంలో తెలుగుదేశం పార్టీ నేత‌లకు అర్థ‌మైన‌ట్లుగా క‌నిపించ‌లేదు. ఎప్పుడు వ‌స్తాయో తెలీని ఎన్నిక‌ల గురించి ఊరికి ముందే మాట్లాడ‌టమే కాదు.. క‌ర్నూలు అసెంబ్లీ సీటు ఎస్వీ మోహ‌న్ రెడ్డికి అంటూ మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో ఎంత‌టి అల‌జ‌డిని సృష్టించాయో తెలియంది కాదు. తొంద‌ర‌పాటుతో లోకేశ్ మాట్లాడారంటూ ప‌లువురు తెలుగు త‌మ్ముళ్లు త‌మ ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో వ్యాఖ్య‌లు చేయటం క‌నిపించింది.

ఇక‌.. త‌న‌కు టికెట్ లేద‌న్న విష‌యాన్ని జీర్ణించుకోలేని టీజీ వెంక‌టేశ్ ఎలా రియాక్ట్ అయ్యార‌న్న‌ది తెలిసిందే. ఇదంతా తొంద‌ర‌పాటుతో లోకేశ్ నోటి నుంచి వ‌చ్చిన ప్ర‌క‌ట‌నే కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ అల‌జ‌డి ఒక కొలిక్కి రాక‌ముందే.. టీడీపీ ఎమ్మెల్యే పీత‌ల సుజాత నోటి నుంచి మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య వ‌చ్చింది.

ఓప‌క్క జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. మంత్రి లోకేశ్ అవినీతిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం.. కొడుకు ఏం చేస్తున్నాడో తండ్రిగా చంద్ర‌బాబు తెలుసుకుంటున్నారా? లేదా? అంటూ ఆ మ‌ధ్య‌న పార్టీ ఆవిర్భావ స‌భ‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. మ‌రోవైపు ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం మంత్రి లోకేశ్ మీద తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తున్నారు కూడా.

వారి ఆరోప‌ణ‌ల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించిన లోకేశ్ తీరుపై ప‌లువురు అసంతృప్తితో ఉన్నారు. లోకేశ్ నిజంగా త‌ప్పు చేయ‌లేద‌న్న న‌మ్మ‌కం ఉంటే.. త‌న మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల మీద సీబీఐ దర్యాప్తు చేయాల‌ని ఎందుకు కోర‌రు? అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు. ఇలాంటి వేళ‌లో టీడీపీ ఎమ్మెల్యే ఒక‌రు లోకేశ్ కాబోయే సీఎం అన్న వ్యాఖ్య ఒక ఎత్తు అయితే.. ఆ మాట‌ను లోకేశ్ స‌మ‌క్షంలోనే వ్యాఖ్యానించ‌టం మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల ద్వారా ఎన్నిక కాకుండా.. దొడ్డి దారిన ఎమ్మెల్సీగా ఎన్నికై.. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన లోకేశ్ ను కాబోయే ముఖ్య‌మంత్రి అన్న మాట‌ను ఏర‌కంగా చెబుతార‌న్న అభ్యంత‌రాలు ప‌లువురి నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లోకేశ్ కాబోయే ముఖ్య‌మంత్రి అని.. చంద్ర‌బాబు త్వ‌ర‌లో కేంద్రానికి వెళ్ల‌నున్న‌ట్లుగా పీత‌ల వ్యాఖ్యానించారు. టీడీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా పీత‌ల మాట మారింద‌ని చెప్ప‌త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే..పీత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లకు కాస్త ముందుగా మంత్రి లోకేశ్ పెనుగొండ లోని ప‌లు ప్రాంతాల‌కు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా ప‌లువురు మ‌హిళ‌లు త‌మ స‌మ‌స్య‌ల్ని లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఇన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సి ఉందా? అంటూ లోకేశ్ ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేయ‌టం క‌నిపించింది. నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మీద కంటే కూడా లోకేశ్ సీఎం కానున్నారు.. బాబు కేంద్రానికి వెళ్ల‌నున్నార‌న్న మాట‌ల మీద దృష్టి పెడితే ఇలానే ఉంటుంది మ‌రి.