Begin typing your search above and press return to search.

చిదంబ‌రం.. మామూలోడు కాదుగా.. ఇప్ప‌టికి 20 సార్లు ఎస్కేప్‌

By:  Tupaki Desk   |   21 Aug 2019 5:30 PM GMT
చిదంబ‌రం.. మామూలోడు కాదుగా.. ఇప్ప‌టికి 20 సార్లు ఎస్కేప్‌
X
త‌మిళ‌నాడులో చిదంబ‌రం అనే ఊరు ఉంది. ఈ ఊరు పేరు నుంచి చిదంబ‌ర ర‌హ‌స్యం అనే నానుడి వ‌చ్చింది.అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా చెప్పేదే.. చిదంబ‌ర ర‌హ‌స్యం అనే మాట‌. ఇప్పుడు అచ్చు ఇలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. చిదంబ‌రం.. అనే పేరున్న కాంగ్రెస్ పార్టీ పెద్దాయ‌న‌. నిన్న మొన్న‌టి వ‌రుకు నీతులు చెప్పిన ఈయ‌న చిక్కుల్లో ప‌డ్డారు. తాను కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కుమారుడికి ఇతోధికంగా సాయం చేయించి బుట్ట‌లో ప‌డ్డారు.

పైగా సుప్రీం కోర్టు లాయ‌ర్ కూడా అయిన చిదంబ‌రం.. అన్ని జాగ్ర‌త్త‌లూ తీసుకుని మోసాల ప‌రంపర‌కు తెర‌దీసినా.,. ఎక్క‌డో చేసిన చిన్న మిస్టేక్ ఆయ‌న‌ను ఆయ‌న ఏకైక కుమారుడు కార్తిని కూడా ప‌ట్టించింది. అది 2007, అప్ప‌టికి కాంగ్రెస్ యూపీఏ-1 దేశంలో పాల‌న సాగిస్తోంది. ఈ క్ర‌మంలో అప్ప‌టి మంత్రిగా ఉన్న చిదంబ‌రం త‌న కుమారుడితో ఐఎన్ ఎక్స్ అనే మీడియా సంస్థను ఏర్పాటు చేయించారు. దీనిలో ఇందిరా ముఖ‌ర్జీని కో ఫౌండ‌ర్‌ గా చేర్చారు. అయితే, త‌ర్వాత కాలంలో ఆర్థిక మంత్రిగా చ‌క్రం తిప్పిన చిదంబ‌రం కొడుకు ఒత్తిడి మేర‌కు విదేశీ పెట్టుబ‌డుల‌ను వ‌క్ర‌మార్గంలో దీనిలోకి ప్ర‌వేశ పెట్టారు.

ఇలా వ‌చ్చి చేరిందే 305 కోట్లు. దీనికి లెక్కా ప‌త్రాలు లేక పోగా, మ‌నీలాండ‌రింగ్ చ‌ట్టాల‌ను కూడా ఉల్లంఘించార‌నేది సీబీఐ- ఈడీ అధికారుల ప్ర‌ధాన ఆరోప‌ణ. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న మోడీ ప్ర‌భుత్వం అంతు చూడాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే చిదంబ‌రం ఇంటిపై ప‌లుమార్లు ఐటీ అధికారులు కూడా దాడులు చేశారు. ఇక‌, చిదంబ‌రం కుమారుడు కార్తిని అదుపులోకి తీసుకుని 23 రోజుల పాటు జైల్లో కూడా పెట్టారు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న బెయిల్‌ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే, అస‌లు ఈ కేసులో చిదంబ‌ర‌మే కీల‌క‌మంటూ.. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించ‌డం- ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో అస‌లు చిక్కు ఇప్పుడు చిదంబ‌రం మెడ‌కు చుట్టుకుంది.

2017, మే 15న ఐఎన్ ఎక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. యూపీఏ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన చిదంబరం, ఆయన కుమారుడు కార్తీపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇక అప్పటినుంచి ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో చిదంబరం, దర్యాప్తు సంస్థలు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. కానీ గతేడాది ఎట్టకేలకు కార్తీని అరెస్ట్ చేశారు. పలు విడతలుగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చిదంబరం కోర్టులను ఆశ్రయిస్తునే ఉన్నారు. మే 15- 2017 నుంచి దాదాపు రెండేళ్లలో అరెస్ట్ కాకుండా స్టే తెచ్చుకున్నారు చిదంబరం, ఆయన కుమారుడు. ఇప్పటికే కోర్టులు వారిద్దరికీ 20 సార్లు ఊరట కలిగింది.

కానీ గతేడాది కార్తీ విచారణ తర్వాత .. నిధుల గోల్ మాల్ గురించి సీబీఐ- ఈడీ అధికారులు చిదంబరంపై ఫోకస్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ చుక్కెదురు కావడంతో .. సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా వేగంగా పిటిషన్ విచారించలేమని స్పష్టంచేసింది. దీంతో చిదంబ‌రాన్ని అరెస్టు చేసేందుకు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ఇంత‌లోనే ఆయ‌న అజ్ఞాతంలోకి వెళ్ల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదీ మ‌న దేశ నేత‌ల నిర్వాకం అంటున్నారు మేధావులు.