Begin typing your search above and press return to search.

కూచిబొట్ల భార్య‌కు అమెరికాలో ప్ర‌త్యేక గుర్తింపు

By:  Tupaki Desk   |   12 Jan 2018 4:56 PM GMT
కూచిబొట్ల భార్య‌కు అమెరికాలో ప్ర‌త్యేక గుర్తింపు
X
అమెరికాలో జాత్యాహంకారి చేతిలో హ‌త్య‌కు గురైన తెలుగు ఎన్నారై శ్రీ‌నివాస్ కూచిబొట్ల ఉదంతం అంద‌రినీ కల‌చివేసిన ఉదంతం మ‌న‌కు తెలిసిందే. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 22న జ‌రిగిన ఘ‌ట‌న‌లో పురింట‌న్ అనే వ్య‌క్తి ఆస్టిన్ బార్‌లో కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న‌లో కూచిబొట్ల ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ఇదే ఘ‌ట‌న‌లో అలోక్ మ‌ద‌సానిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. జాతి వివ‌క్ష‌తోనే పురింట‌న్ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. పిస్తోల్‌తో కాల్పులు జ‌రిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింట‌న్ అరుపులు పెట్టిన‌ట్లు సాక్షులు తెలిపారు. నిందితుడు పురింట‌న్‌ ను అడ్డుకున్న అమెరికా శ్వేత‌జాతీయుడు ఇయాన్ గ్రిల్ల‌ట్ ఇదే ఘ‌ట‌న‌లో హీరోగా ఆవిర్భ‌వించాడు. అయితే తాజాగా శ్రీ‌నివాస్‌ భార్య సున‌య‌న దుమ‌ల‌కు అమెరికా ప్ర‌త్యేక గుర్తింపు ఇచ్చింది. అమెరికా అధ్య‌క్షుడి ప్ర‌సంగానికి హాజ‌ర‌య్యే అవ‌కాశం క‌ల్పించారు.

హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమాలకు అమెరికాలో వీసా సమస్య ఎదురైన సంగ‌తి తెలిసిందే. భర్త మృతితో సునయన రెసిడెంట్ ప్రతిపత్తిని కోల్పోయారు. భర్త అంత్యక్రియల కోసం భారత్‌ కు వచ్చిన ఆమె తిరిగి అమెరికాకు వెళ్ల‌లేకపోతున్నారు. ఆమెను అధికారులు వెనుకకు తిప్పి పంపే అవకాశాలు ఉండడమే ఇందుకు కారణం. ఆమెకు వీసా ఇప్పించేందుకు తనవంతు కృషి చేస్తానని కాన్సస్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ తెలిపారు. ఈ వీసా స‌మ‌స్య పరిష్కారానికి కాన్సస్ కాంగ్రెస్ సభ్యుడుతో పాటు మరికొందరు ముందుకు వచ్చారు. త‌ద్వారా ఆమెకు పెద్ద ఉపశ‌మ‌నం ద‌క్కింది.

అయితే అదే కెవిన్ మ‌రోమారు సున‌య‌న దుమ‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు క‌ల్పించారు. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల‌ 30న ఉభ‌య స‌భ‌లను ఉద్దేశించి సంయుక్తంగా ప్ర‌సంగించ‌నున్నారు. ఈ ప్ర‌సంగానికి హాజ‌రు కావాల్సిందిగా సున‌య‌న దుమ‌ల‌కు రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్ ఆహ్వానం పంపించారు. `ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ ఏ విధంగా వైఫ‌ల్యం చెందింద‌నేది తెలియ‌జెప్పేందుకు ఆమె ప్ర‌బ‌ల‌మైన తార్కాణం`అని కెవిన్ పేర్కొన్నారు. తాను వ‌ల‌స‌వాదుల విష‌యంలో ఎందుకు ఆస‌నుకూలంగా ఉంటానో ఈ సంద‌ర్భంగా కెవిన్ వివ‌రించారు. `అమెరికా అంద‌రినీ ప్రేమించ‌డంతో పాటుగా అక్కున చేర్చుకునే దేశం అని భారతీయ స‌మాజానికి తెలియ‌జెప్పాలి. దీంతో పాటుగా ప్ర‌పంచానికి కూడా ఈ సందేశాన్ని చాటాలి` అని ఆయ‌న‌ ఆకాంక్షించారు.

కాగా, సున‌య‌న ప్ర‌స్తుతం భార‌త‌దేశానికి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. త‌న భ‌ర్త ప్రథమ వ‌ర్థంతిని నిర్వ‌హించేందుకు ఆమె మాతృభూమికి వ‌స్తున్నారు. శ్రీ‌నివాస్ మ‌ర‌ణం స‌మ‌యంలో కుటుంబ స‌భ్యులు, మిత్రులు స‌హా మిగ‌తా వారంద‌రి నుంచి త‌న‌కు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ద‌క్కింద‌ని ఆమె తెలిపారు. తాను అమెరికాలో నివ‌సించ‌వ‌చ్చ‌నే భ‌రోసాను క‌ల్పించింద‌ని వివ‌రించారు.

కాగా, శ్రీ‌నివాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న స‌తీమ‌ణి సున‌య‌న గ‌త ఏడాది తెలిపిన జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వారి మ‌ధ్య అన్యోన‌త‌ను చాటిచెప్పిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. మార్చి 9వ తేదీన ఆయ‌న పుట్టిన‌రోజు. శ్రీ‌నివాస్ జీవించి ఉంటే ఆ రోజుకు ఆయ‌న వ‌య‌స్సు 33 ఏళ్లు నిండేవి. త‌న భ‌ర్త అంటే ఎంతో మ‌మ‌కారం ఉన్న శ్రీ‌నివాస్ స‌తీమ‌ణి సున‌య‌న దుమ‌ల ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ మేర‌కు ఫేస్ బుక్‌లో ఒక పోస్ట్ పెట్టి భ‌ర్త‌పై త‌నకున్న వెల‌క‌ట్ట‌లేని ప్రేమ‌ను చాటుకుంది. "నా ప్రియ‌మైన ప్రేమ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. ఈ రూపంలో నీకు శుభాకాంక్ష‌లు చెప్పాల్సి వ‌స్తుంద‌ని అనుకోలేదు. నిన్ను చాలా కోల్పోతున్నాను. కొత్త నివాసంలో నువ్వు చుట్టుపక్క‌ల ఉన్న ఆహ్లాద‌క‌ర‌మైన మ‌నషులు, ప‌రిస్థితుల మ‌ధ్య సంతోషంగా ఉన్నావ‌ని భావిస్తున్నాను. నీ చుట్టూతా ప్రేమ‌ను మాత్ర‌మే పంచే మ‌నుషులు ఉన్నార‌ని భావిస్తున్నాను. నీపై అప‌రిమ‌త ప్రేమ‌ను క‌లిగి ఉన్నాను" అని సున‌య‌న పోస్ట్ చేశారు. కాగా, శ్రీ‌నివాస్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీర‌య్యారు. ప్ర‌తి పుట్టినరోజు నాడు త‌మ‌తో మాట్లాడట‌మే కాకుండా వీడియో కాల్ ద్వారా ఆశీస్సులు తీసుకునేవాడ‌ని శ్రీ‌నివాస్ కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న జ‌న్మదినం స‌మ‌యంలో త‌న జ్ఞాప‌కాల‌తోనే ఆ కుటుంబం గ‌డిపేసింది.