Begin typing your search above and press return to search.

చింత‌మనేని మాత్ర‌మే ఇలా చేయ‌గ‌ల‌డు

By:  Tupaki Desk   |   25 Aug 2016 10:24 AM GMT
చింత‌మనేని మాత్ర‌మే ఇలా చేయ‌గ‌ల‌డు
X
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ గురించి పరిచ‌యం అవ‌స‌రం లేదు. ఎమ్మార్వో వ‌న‌జాక్షి విధుల నిర్వ‌హ‌ణ‌లో వివాదాస్ప‌ద తీరుతో ఒక్క‌సారిగా ఆయ‌న‌ తెర‌మీద‌కు వ‌చ్చారు. అనంత‌రం కొల్లేరు స‌ర‌స్సు నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించార‌నే వార్త‌లతో మ‌ళ్లీ ద‌ర్శ‌న‌మిచ్చారు. తాజాగా ఇపుడు కొత్త రూపంలో చింత‌మనేని వార్త‌ల్లో నిలిచారు. అదే పాలాభిషేకం!

స‌హ‌జంగా క్షీరాభిషేకం అంటే ఏదైనా కీల‌క నిర్ణ‌యం వెలువ‌డేందుకు కార‌ణం అయిన సంద‌ర్భంలో స‌దరు వ్య‌క్తుల చిత్ర ప‌టాల‌కు లేదా ఫ్లెక్సీల‌కు పాలాభిషేకం చేస్తారు. కానీ ఏకంగా త‌న‌కే క్షీరాభిషేకం చేసుకొని చింత‌మనేని వార్త‌ల్లో నిలిచారు. చింతమనేని ప్రభాకర్‌ కు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన రైతులు పాలాభిషేకం చేశారు. పోలవరం కుడికాలువ నీటిని గుండేరు ద్వారా చెరువులకు మళ్లించి పంటలు రక్షించారంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ సంబరాలు జ‌రిపారు. గ్రామంలో సుమారు 350 ఎకరాలకు సాగునీరు అందించారంటూ కొనియాడుతూ అదే కాలువ గ‌ట్టుపై కూర్చోబెట్టి చింత‌మ‌నేనికి క్షీరాభిషేకం చేశారు. త‌ద్వారా ఎమ్మెల్యే హోదాలో అదికూడా ప్ర‌త్య‌క్షంగా త‌న‌కే పాలాభిషేకం చేసుకున్న వ్య‌క్తిగా చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ వార్త‌ల్లో నిలిచారు.