Begin typing your search above and press return to search.

ఎలక్షన్ కమిషన్‌ కూ ఫేక్ న్యూస్ సెగ

By:  Tupaki Desk   |   22 Feb 2019 5:11 PM GMT
ఎలక్షన్ కమిషన్‌ కూ ఫేక్ న్యూస్ సెగ
X
ఫేక్ న్యూస్ సెగ ఎలక్షన్ కమిషన్‌ కూ తగిలింది. ఎలక్షన్ కమిషన్ తీసుకోని నిర్ణయాలను కూడా ఆ కమిషన్ తాజా నిర్ణయాలుగా చెబుతూ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో తీవ్రంగా స్పందించింది. అలాంటి కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రానున్న ఎన్నికల్లో ఎన్నారైల ఆన్‌ లైన్లో ఓటేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించదంటూ కొద్దిరోజులుగా ఫేస్ బుక్ - ట్విటర్ - వాట్సాప్ వంటి వేదికల్లో వార్తలు ప్రచారమవుతున్నాయి. కానీ, ఇది నిజం కాదు. అయితే, నిజానిజాలు తెలుసుకోకుండా చాలామంది ఇలాంటి తప్పుడు వార్తలు తమ వరకు వచ్చినప్పుడు వాటిని యథాతథంగా ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో ఈ తప్పుడు వార్తా బాగా స్ప్రెడ్ అయిపోయింది.

ఈ సంగతి గుర్తించిన ఎన్నికల సంఘం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారంలోకి తేవడం వల్ల ప్రజల్లో అయోమయం ఏర్పడుతుందని.. ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని పేర్కొంటూ దిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్‌ కు లేఖ రాసింది. ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో కోరుతూ ఫిర్యాదు చేసింది.

మరోవైపు ఇప్పటికే ట్విటర్, వాట్సప్‌లను ఈ విషయంలో ఎన్నికల సంఘం సంప్రదించింది. ఈ తప్పుడు ప్రచారానికి సంబంధించిన పోస్టులు, సందేశాలను తొలగించాలని ఆ రెండు సంస్థలను కోరింది.

ఈసీ లోగోను అనుమతి లేకుండా వినియోగించుకుంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నవారి విషయంలో చర్యలు తీసుకోవాలని.. సత్వరమే ఈ విషయంలో దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని ఈసీ దిల్లీ పోలీసులను కోరింది.