Begin typing your search above and press return to search.

‘ఖేడ్’ మీద ఎగ్జిట్ సర్వేల మాటేంటి?

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:53 AM GMT
‘ఖేడ్’ మీద ఎగ్జిట్ సర్వేల మాటేంటి?
X
నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఎవరూ ఊహించని విధంగా భారీ పోలింగ్ నమోదై నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు కావటానికి కిందామీదా పడితే.. ఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రజలు భారీగా తరలి వచ్చి తమ తీర్పును ఇవ్వటం గమనార్హం. రికార్డు స్థాయిలో 81.79 శాతం పోలింగ్ నమోదైంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే కిష్ణారెడ్డి మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ తరఫున కిష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. సాధారణంగా ఇలాంటి వాతావరణంలో జరిగే ఉప ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీయటం.. మరణించిన అభ్యర్థి వారసుల వైపే ప్రజలు మొగ్గు చూపే పరిస్థితి. అయితే.. మంత్రి హరీశ్ రావు కారణంగా భిన్నమైన పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ముగిసిన నారాయణ ఖేడ్ ఉప ఎన్నికపై మూడు సంస్థలు తమ సర్వేల్ని వెల్లడించాయి.

భారీగా పోలింగ్ నమోదు అయిన నేపథ్యంలో.. టీఆర్ఎస్ కు 70వేల ఓట్ల మెజార్టీ పక్కా అని చెబుతున్నారు. సానుభూతి ఓట్లతో ఖేడ్ ఉప ఎన్నికల్లో గట్టెక్కటానికి ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ కు 20 శాతం ఓట్లు దక్కటం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఒక మండలంలో కాంగ్రెస్ కు సానుకూలత వ్యక్తమైందని.. ఈ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ లభించే అవకాశం ఉందని.. తెలుగుదేశం అభ్యర్థికి అలాంటి అవకాశం లేదని.. డిపాజిట్ గల్లంతు కావటం ఖాయంగా అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఖేడ్ ఉప ఎన్నికల్లోనూ కారు దూసుకెళ్లటం ఖాయమంటున్నారు.