Begin typing your search above and press return to search.

అంత సీనియర్లు.. ఇప్పుడు మంత్రులయ్యారు..

By:  Tupaki Desk   |   19 Feb 2019 7:22 AM GMT
అంత సీనియర్లు.. ఇప్పుడు మంత్రులయ్యారు..
X
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని క్యాబినెట్ సీనియర్లు - జూనియర్ల కలయికతో సమతూకంగా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో క్యాబినెట్ విస్తరించకుండా పరిమితంగా కేసీఆర్ విస్తరణ చేపట్టారు.. 10మందితో తొలి క్యాబినెట్ విస్తరణ చేశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.

ఈసారి క్యాబినెట్ పదవులు దక్కించుకున్న వారిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కడం విశేషం. మేడ్చల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లారెడ్డి - వనపర్తి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలు కేసీఆర్ క్యాబినెట్ లో అవకాశం దక్కించుకొని జాక్ పాట్ కొట్టారు. మల్లారెడ్డి గతంలో టీడీపీ నుంచి మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. ఈసారి టీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది మంత్రి పదవీని అనూహ్యంగా దక్కించుకున్నారు. అలాగే నిరంజన్ రెడ్డి గతంలో వనపర్తి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి అక్కడి నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ బర్త్ ఖరారు చేసుకున్నారు. నిరంజన్ రెడ్డి గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001 తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్న నిరంజన్ రెడ్డి ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలవడంతో కేసీఆర్ పిలిచి మరీ మంత్రిపదవి ఇచ్చారు.

అదేవిధంగా క్యాబినెట్ లో పలువురు సీనియర్లకు అవకాశం దక్కింది. ఆరుదఫాలుగా ఎమ్మెల్యేగా - ఒక దఫా ఎంపీగా ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధించారు. టీఆర్ ఎస్ నుంచి తొలిసారి విజయం సాధించడంతో కేసీఆర్ క్యాబినెట్ లో ఆయనకు అవకాశం దక్కింది. ఎర్రబెల్లి సీనియర్ నాయకుడు.వరంగల్ జిల్లా పార్వతిగిరి సొంతూరు. 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వంలో విప్ గా పనిచేశారు. 1994 -1999 - 2004 - 2016 లో టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో ఎంపీగాను గెలిచారు. ఇంత సీనియారిటీ ఉన్న ఉమ్మడి ఏపీలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అదే ఆయన చిరకాల వాంఛగా రాజకీయాల్లో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఎర్రబెల్లి కోరికను కేసీఆర్ నెరవేర్చాడు.

అలాగే ఇంద్రకరణ్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా - నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిందటి ఎన్నికల్ల బీఎస్పీ తరపున పోటీ చేసి గెలిచారు. ఈసారి టీఆర్ ఎస్ నుంచి గెలుపొంది క్యాబినెట్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొప్పుల ఈశ్వర్ కు తొలిసారి మంత్రి పదవీ దక్కింది. మహబూబ్ నగర్ నుంచి విజయం సాధించిన శ్రీనివాస్ గౌడ్ కు ఈసారి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవీ దక్కింది.

అలాగే కిందటిసారి కేసీఆర్ క్యాబినెట్లో పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ - జగదీశ్ రెడ్డి - ఈటల రాజేందర్ రెడ్డిలకు తిరిగి అవకాశం దక్కింది. కొత్త, పాత కలయికతో కేసీఆర్ క్యాబినెట్ సమతూకంగా ఉంది.