Begin typing your search above and press return to search.

త‌ప్పు చేసిన నేత‌లు ఎన్నిక‌ల్లో పోటీచేయ‌లేరు

By:  Tupaki Desk   |   21 March 2017 4:41 AM GMT
త‌ప్పు చేసిన నేత‌లు ఎన్నిక‌ల్లో పోటీచేయ‌లేరు
X
రాజ‌కీయాలు ప‌రిశుద్ధం అయ్యే నిర్ణ‌యం ఒక‌టి వెలువ‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. కళంకిత నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం ఒక పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఏదైనా కేసులో శిక్ష పడిన నేతలు ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటికే ఏదైనా పదవిలో ఉన్నట్టయితే వారు ఆ పదవి నిర్వహించడానికి కూడా అనర్హులవుతారు. దీనికి మ‌రో ముంద‌డుగు అన్న‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

కళంకిత నేతలపై జీవితకాలం నిషేధం విధించడానికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. రాజకీయ నాయకులపై ఉన్న కేసుల సత్వర విచారణకు కూడా ఎన్నికల సంఘం మద్దతు తెలిపింది. కళంకిత నేతలను ఎన్నికల రాజకీయాలకు జీవితాంతం దూరంగా ఉంచాలని బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం నేపథ్యంలో ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌ ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అభియోగాలు నమోదైన నేతలను కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించవచ్చా అనే ప్రశ్నను కూడా ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ లేవనెత్తింది. ఇవే విషయాల్లో ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ జేఎం లింగ్డో - పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా పిటిషన్లు వేశాయి. వీటన్నింటినీ త్వరలో ఏర్పాటు చేయనున్న విస్తృత ధర్మాసనానికి నివేదించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/