Begin typing your search above and press return to search.

మోడీ ఇలాకాలో ఎన్నికపై ఈసీ ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   12 Oct 2017 2:23 PM GMT
మోడీ ఇలాకాలో ఎన్నికపై ఈసీ ట్విస్ట్‌
X
దేశంలో రెండు రాష్ర్టాల ఎన్నిక‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో ఎన్నిక‌ల క‌మిష‌న్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. గుజరాత్‌ - హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల తేదీలను ప్రకటించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ లో నవంబర్‌ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న నోటిఫికేషన్‌ వెలువడనుంది. మరోవైపు డిసెంబర్‌ 18కు ముందే గుజరాత్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 18న చేపట్టనున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేసి గుజ‌రాత్‌ ను పెండింగ్‌ లో ఉంచడం ఆస‌క్తిక‌రంగా మారింది.

హిమాచల్‌ తోపాటు కీలకమైన గుజరాత్ ఎన్నికల నగారా కూడా ఇవాళే మోగుతుందని అంతా భావించారు. రెండు రాష్ర్టాలకు ఒకేసారి షెడ్యూల్ విడుదల చేయనున్నారని ఉదయం నుంచీ వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం కేవలం హిమాచల్ డేట్లు ప్రకటించి.. గుజరాత్‌ ను మాత్రం పెండింగ్‌ లో పెట్టింది. డిసెంబర్ 18లోపు జరుగుతాయని మాత్రం తెలిపింది. దీని వెనుక ఓ సాంకేతిక కారణం ఉన్నట్లు సీఈసీ ఏకే జ్యోతి చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు సంబంధించి కాల పరిమితి నిబంధన ఉన్నందున గుజరాత్ షెడ్యూల్ విడుదల చేయలేదని ఆయన వెల్లడించారు. ఈ కాల పరిమితి 46 రోజులుగా ఉంది. అంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 46 రోజుల్లోపు ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. అయితే హిమాచల్ ఎన్నికల ఫలితాలు గుజరాత్‌పై ప్రభావం చూపకుండా ఉండేందుకు డిసెంబర్ 18లోపే ఎన్నికలు నిర్వహిస్తామని ఏకే జ్యోతి స్పష్టంచేశారు.

కాగా, ఇప్ప‌టికే గుజ‌రాత్‌ లో ప్ర‌చారం హోరెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు - ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షా - కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌టిస్తున్నారు. త‌మ‌దైన శైలిలో అభివృద్ధి అంశాల‌పై వివ‌ర‌ణ ఇస్తూ పొలిటిక‌ల్ హీట్ పెంచేస్తున్నారు.