Begin typing your search above and press return to search.

విపక్షాలకు షాకిస్తూ ఈసీ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   22 May 2019 11:27 AM GMT
విపక్షాలకు షాకిస్తూ ఈసీ సంచలన నిర్ణయం
X
మే23న కౌంటింగ్ లో ముందు వీవీ ప్యాట్స్ లెక్కించాలని.. తేడా వస్తే మొత్తం నియోజకవర్గంలోని వీవీ ప్యాట్స్ ను సరిచూడాలని కోరుతూ చంద్రబాబు నేతృత్వంలో దేశంలోని 21 పార్టీల విపక్ష నేతలు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు. దీనిపై బుధవారం నిర్ణయం చెబుతామని ఈసీ తెలిపింది. తాజాగా విపక్షపార్టీలకు షాకిస్తూ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది.

వీవీ ప్యాట్స్ ను ముందు లెక్కించమని.. తేడా వచ్చినా 5 వీవీ ప్యాట్స్ ఓట్లనే పరిగణలోకి తీసుకుంటామని.. మొత్తం లెక్కించడం కుదరదని తాజాగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో పునరాలోచన లేదని.. తాము ఇచ్చిన ఆదేశాల ప్రకారమే కౌంటింగ్ రేపు సాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపక్షాలకు షాకిచ్చింది..

మంగళవారం చంద్రబాబు నేతృత్వంలో ఢిల్లీలో కౌంటింగ్ రోజున ముందు వీవీ ప్యాట్స్ లెక్కించేలా ఈసీని ఒప్పించాలని కాంగ్రెస్, ఇతర బీజేపీ వ్యతిరేక 21 పార్టీల నేతలు ఢిల్లీలో ఉద్యమించారు. కోర్టుకు వెళ్లినా సుప్రీం నో చెప్పడంతో చివరగా ఈసీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు నేతలంతా కూటమిగా ఈసీ వద్దకు వెళ్లారు.

అయితే ఈసీ మాత్రం చంద్రబాబు సహా ప్రతిపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 5 వీవీ ప్యాట్స్ ను లెక్కిస్తామని.. అది ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాకే అని తెలిపింది.

దీంతో బాబు సహా ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు చేసిన నిన్నటి ఆందోళన బూడిదలో పోసిన పన్నీరైంది. చంద్రబాబు ఎలాగైనా వీవీ ప్యాట్స్ ను లెక్కించాలని శతవిధాలా ప్రయత్నించిన ఈసీ నిర్ణయంతో ఇప్పుడు షాక్ తిన్నారు.