Begin typing your search above and press return to search.

ఎవరిని నమ్మి రోశయ్య బుక్ అయ్యారు..?

By:  Tupaki Desk   |   30 May 2016 4:33 AM GMT
ఎవరిని నమ్మి రోశయ్య బుక్ అయ్యారు..?
X
సీనియర్ రాజకీయ నేతగా.. అజాత శత్రువుగా వ్యవహరిస్తూ పెద్దరికానికి మారుపేరుగా.. హుందా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాజకీయ నాయకులు కాస్త తక్కువే. అలా తక్కువగా ఉన్న నేతల్లో ఇలాంటి లక్షణాలు ఉన్న నేతగా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను చెప్పాలి. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరోపణలు తక్కువేనని చెప్పాలి.

మంత్రిగా.. ముఖ్యమంత్రిగా.. గవర్నర్ గా ఇలా పలు బాధ్యతలు చేపట్టినా.. వివాదాస్పదం అయ్యేలా వ్యవహరించింది లేదనే చెప్పాలి. కాకుంటే సొంతవాళ్లకు సంబంధించిన భూమిని కట్టబెట్టేందుకు కాస్త కక్కుర్తిపడినట్లుగా అమీర్ పేట భూమి విషయంలో ఆయనపై ఆరోపణ వచ్చింది. అయితే.. దీనికి కారణం రోశయ్య అనే కన్నా.. ఆయన నమ్మిన సిద్దాంతమే ఆయన్ను దెబ్బ తినేలా చేసిందని ఆయన సన్నిహితులు వాపోతుంటారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా.. పరిపాలనా నిర్ణయాలకు సంబంధించి సీనియర్ అధికారుల మాటకు రోశయ్య అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అలవాటు ఉంది.

వారి నోటి నుంచి ఫలానా పని చేయొచ్చు సార్ అన్నప్పుడు.. ‘‘ఇబ్బందులు రావు కదా?’’ అన్న ప్రశ్న రోశయ్య నోటి నుంచి వస్తుందని.. అందుకు సీనియర్ అధికారులు ‘ఎలాంటి ఇబ్బంది లేదు సార్’’ అన్న మాట రావటం ఆలస్యం ఫైలు మీద చేవ్రాలు చేసేస్తారని చెబుతారు. ఇలాంటి ప్రాసెస్ లో భాగంగానే తన కుటుంబ సభ్యులకు అమీర్ పేట భూముల్ని కట్టబెట్టే విషయంలో అనవసరంగా చిక్కుకున్నట్లుగా చెబుతారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మరో వివాదంలో రోశయ్య ఇరుక్కోవటం గమనార్హం. తమిళనాడు గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆయన తన పనేంటో తాను చేసుకోవటం మినహా.. ఒక్క ఇంచ్ కూడా అనవసరంగా వేలు.. కాలు లాంటిది పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెబుతారు. అయితే.. అధికారులు ఇచ్చిన డైరెక్షన్ తో ఆయన పంపిన నోట్ ను కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వ్యతిరేక వ్యాఖ్య రావటంతో పాటు.. ఈ తరహా అంశాల్లో గవర్నర్ పాత్ర ఏమీ ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదని వ్యాఖ్యానించటం గమనార్హం.

ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తీవ్ర ఆరోపణల నేపథ్యంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల (అరవకురిసి.. తంజావూరు) ఎన్నికల్ని వెంటనే పూర్తి చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల్ని ఈ నెలాఖరు లోపు పూర్తి చేస్తే.. సదరు నేతలు రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందన్న నోట్ ను పంపారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రోశయ్య పంపిన ఫైల్.. అందులో ఉదహరించిన కోర్టు తీర్పుల్లో తప్పులున్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. ఈ అంశంపై గవర్నర్ హోదాలో ఉన్న రోశయ్య లేఖ రాయకుండా ఉండాల్సిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

తాజా పరిణామాల నేపథ్యంలో వివాదాల్లో తలదూర్చని రోశయ్య అనవసరంగా బుక్ అయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. అయితే.. తమిళనాడు ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి.. ఎప్పటి మాదిరే సీనియర్ అధికారుల్ని నమ్మే అలవాటే రోశయ్య చేత లేఖ పంపించటానికి కారణమైందన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వం నుంచి లేఖ.. అందులో ప్రస్తావించిన అంశాల్లో ఎలాంటి ఇబ్బంది లేదన్న సీనియర్ అధికారుల మాటతో సదరు లేఖపై గవర్నర్ హోదాలో ఉన్న రోశయ్య సంతకం చేసి ఉంటారని.. అదే ఇప్పుడు వివాదానికి అసలు కారణమని తెలుస్తోంది. ఏమైనా.. రోశయ్య తన అలవాటును మార్చుకోవటం మంచిదన్న సూచన పలువురు నోటి నుంచి వినిపిస్తోంది.