Begin typing your search above and press return to search.

12 అంటున్న టీడీపీ - 10 ప్లస్ అంటున్న వైఎస్సార్సీపీ!

By:  Tupaki Desk   |   25 April 2019 4:30 PM GMT
12 అంటున్న టీడీపీ - 10 ప్లస్ అంటున్న వైఎస్సార్సీపీ!
X
పోలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో విజయం ఎవరిది అవుతుందో అంతుబట్టని స్థితిలో ఉన్నారు ఏపీ జనాలు. పార్టీలు మాత్రం దేనికది తమదే విజయం అనే ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మొత్తంగా చూసినా - క్షేత్ర స్థాయికి వెళ్లి చూసినా పార్టీల్లో ఒకే తరహా ధీమా వ్యక్తం అవుతూ ఉంది.

జిల్లాల వారీగా నేతలను సంప్రదిస్తున్నా ఇదే మాటే వినిపిస్తూ ఉంది. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా లో పోలింగ్ ముగిసిన తర్వాత నేతలు వ్యక్తం చేస్తున్న ధీమాను గమనిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఈ జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఫుల్ ఎడ్జ్ లభించిన సంగతి తెలిసిందే.

ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసింది. తూర్పుగోదావరి తెలుగుదేశం పార్టీని ముందంజలో నిలిపింది. గతం సరే - ఈ సారి పరిస్థితి ఏమిటి అంటే? తెలుగుదేశం వాళ్లు మళ్లీ తమదే హవా అని అంటున్నారు. ఆ జిల్లాలో తాము పన్నెండు సీట్లలో విజయపతాకను ఎగరేస్తామంటూ తెలుగుదేశం నేతలు ధీమాగా చెబుతూ ఉన్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత తాము చూసుకున్న లెక్కల్లో ఈ విషయం తేలిందని వారు అంటున్నారు.

బూత్ ల వారీగా తాము లెక్కలన్నింటినీ చూసుకోగా పన్నెండు సీట్లలో తమకు విజయం లభిస్తుందని తేలిందని తెలుగుదేశం పార్టీ వాళ్లు అంటున్నారు. ఇక ఈ ధీమా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఉంది. పన్నెండు అనడం లేదు కానీ.. కనీసం పది సీట్లలో విజయం తమదే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా నేతలు అంటున్నారు. అలాగే జిల్లాలోని మూడు ఎంపీ సీట్లలో కూడా విజయయం తమదే అనే ధీమాలో ఉన్నారు వాళ్లు.

తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా మూడు ఎంపీ సీట్లలోనూ తమదే విజయం అని అంటున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ ను ప్రభావితం చేసిన అంశాలను ఈ నేతల వద్ద ప్రస్తావించినా - ఎవరికి వారు కొన్ని ఫ్యాక్టర్లను ప్రస్తావిస్తూ.. విజయం మాత్రం తమదే అని అంటున్నారు. మరి వీరి ధీమాలు సరే - అసలు సంగతి ఏమిటి? అంటే, మే ఇరవై మూడు వరకూ అందుకోసం వేచి ఉండాల్సిందే!