Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టు అథారిటీ క‌న్నా అంబానీ మిన్నా?

By:  Tupaki Desk   |   17 May 2018 6:54 AM GMT
ఎయిర్ పోర్టు అథారిటీ క‌న్నా అంబానీ మిన్నా?
X
విందు భోజనంలో......`వడ్డించేవాడు మనవాడయితే ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు` అన్న త‌ర‌హాలో ఉంది టీడీపీ స‌ర్కార్ ప‌రిస్థితి. గ‌ల్లీల్లోని సీసీ రోడ్లు మొద‌లు......పెద్ద పెద్ద ఎయిర్ పోర్టుల వ‌ర‌కు కాంట్రాక్టుల‌న్నీ త‌మ అనుయాయుల‌కే ద‌క్కేలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌మకు కావాల్సిన వారికి టెండ‌ర్లు ద‌క్కేలా ఎంత‌కైనా దిగ‌జారుతోంది. అయినవాళ్ళకు ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ అన్న త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తూ విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంది. భోగాపురం విమానాశ్ర‌య అభివృద్ధి ప‌నుల ప్రాజెక్టులో టీడీపీ స‌ర్కార్ లోపాయికారి ఒప్పందంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాజెక్టు బాధ్య‌త‌ల‌ను అత్యంత అనుభ‌వశీలి అయిన ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు కాకుండా ప్రైవేటు సంస్థల‌కు దారాద‌త్తం చేయ‌లాని చంద్ర‌బాబు స‌న్నాహాలు చేస్తున్నారని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆ ప్రాజెక్టును రిల‌య‌న్స్ సంస్థ‌కు అప్ప‌గించేందుకు చంద్ర‌బాబు సుముఖంగా ఉన్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వ సెక్ర‌ట‌రీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎన్ ఎస్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడితో అనిల్ అంబానీ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. శ‌ర్మ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో భోగాపురం ప్రాజెక్టు.....రిల‌య‌న్స్ గ్రూపుకు అప్పగించేందుకు చంద్ర‌బాబు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఏఏఐ వేసిన టెండ‌రును ర‌ద్దు చేసుకునేందుకు ఏపీ స‌ర్కార్ యోచిస్తోంద‌ని శ‌ర్మ ఆరోపించారు. స‌రైన కార‌ణం లేకుండా....మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఏఏఐని ప‌క్క‌న‌బెట్టి ప్రైవేటు సంస్థల‌కు ఆ ప్రాజెక్టును దారాద‌త్తం చేయ‌డం ఏమిట‌ని శ‌ర్మ ప్రశ్నించారు. గ‌తంలో జీఎంఆర్ సంస్థ.... ఈ ప్రాజెక్టు చేప‌ట్టేందుకు ముందుకు వ‌చ్చింద‌ని....ఆ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాన‌ని అన్నారు. రిల‌య‌న్స్ వ్య‌వ‌హారాన్ని కూడా కేంద్ర విమాన‌యాన శాఖ దృష్టికి తీసుకువెళ్తాన‌ని చెప్పారు. ఇటువంటి భారీ ప్రాజెక్టుల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వాలు...కేంద్రం స‌హ‌కారం తీసుకోవాల‌ని అన్నారు.