Begin typing your search above and press return to search.

ఉరిలో 177 మంది మరణించారంటున్న ఉగ్రవాది!

By:  Tupaki Desk   |   1 Oct 2016 4:57 PM GMT
ఉరిలో 177 మంది మరణించారంటున్న ఉగ్రవాది!
X
ఉరి సెక్టార్ లో 19 మంది సైనికుల్ని పాక్ ప్రేరిత ఉగ్ర‌వాదులు బ‌లి తీసుకున్న ఘ‌ట‌న ఇంకా భార‌తీయుల‌ను క‌ల‌చి వేస్తూనే ఉంది. అగ్ర‌దేశాలు కూడా పాక్ వైఖ‌రిని త‌ప్పుబ‌డుతున్నాయి. నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి పొంచి ఉన్న ముష్క‌ర ముఠాల‌పై భార‌త సైన్యం జ‌రిపిన స‌ర్జిక‌ల్ దాడులు చేసింది. ఈ దాడుల నేప‌థ్యంలో భారత్ కు అగ్ర‌రాజ్యాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఈ త‌రుణంలో... అనూహ్యంగా మీడియా ముందుకు వ‌చ్చాడు ఉగ్ర‌వాద సంస్థ అధినేత హ‌ఫీజ్ స‌యీద్ మీడియా ముందుకు వ‌చ్చాడు. ముంబై దాడుల సూత్ర‌ధారి ఇత‌డే. ఉరీ ఘ‌ట‌న గురించి భార‌త్ అబ‌ద్ధాలు చెబుతోంద‌న్నాడు. ఆ దాడిలో చ‌నిపోయిన భార‌త సైనికులు 19 మంది కాద‌నీ, మొత్తం 177 ఇండియ‌న్ ఆర్మీ సిబ్బంది మ‌ర‌ణించార‌ని ఇత‌గాడు చెబుతున్నాడు.

భార‌త్ నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ దాడులపై కూడా అడ్డ‌గోలు వ్యాఖ్య‌లు చేశాడు. స‌ర్జిక‌ల్ దాడి పేరుతో భార‌త్ చెబుతున్న‌దంతా బూట‌కం అన్నాడు ఈ ముంబై పేలుళ్ల సూత్ర‌ధారి. ఓ గ‌దిలో కూర్చుని ప‌క్కా స్కెచ్ వేసుకుని థోవ‌ల్ చెప్పిన క‌ట్టుక‌థ ఇది అంటూ ఆరోపించాడు! ఎల్‌.ఓ.సీ. దాటి వ‌చ్చి ఏదో సాధించామ‌ని చెప్పుకోవ‌డం అంతా అస‌త్య‌మ‌న్నాడు. భార‌త్ చెప్పుకుంటున్న దాడుల్లో పాక్ కి ఏమాత్రం న‌ష్టం క‌ల‌గ‌లేద‌ని చెప్పాడు. అంతేకాదు, నిజ‌మైన స‌ర్జిక‌ల్ దాడులు ఏంటో భార‌త్ కు పాక్ సైన్యం చూపిస్తామ‌నీ, ప్ర‌ధాన‌మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ సైన్యానికి అవ‌కాశం ఇస్తే భార‌త్ కు అస‌లైన దాడుల రుచి ఏంటో తెలుస్తుంద‌ని అంటూ పిచ్చికూత‌లు కూశాడు. పాకిస్థాన్ త‌ల్చుకుంటే త‌మ‌ని అడ్డుకునేంత ధైర్యం అగ్ర‌రాజ్య‌మైన అమెరికాకి కూడా లేద‌ని హ‌ఫీజ్ స‌యీద్ అన్నాడు. ఫైజ‌లాబాద్ లో నిర్వ‌హించిన ఒక స‌భ‌లో ఇలా పాక్ సైన్యాన్ని రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశాడు.

ఉరీ దాడి గురించి మాట్లాడుతూ... ఈ దాడిలో మొత్తం 177 మంది భార‌త సైనిక సిబ్బంది మ‌ర‌ణించాడ‌ని హ‌ఫీజ్ అన్నాడు. గాయాల‌పాలైనవారి సంఖ్య చాలానే ఉంటుంద‌ని అన్నాడు. కానీ, భార‌త్ 19 మంది జ‌వాన్లు మ‌ర‌ణించిన‌ట్టుగానే అబ‌ద్ధాలు చెబుతోంద‌ని వ్యాఖ్యానించాడు. ఇండియాపై రివేంజ్ తీర్చుకునేందుకు పాక్ సైన్యానికి ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని ప్ర‌ధానిని కోరాడు హ‌ఫీజ్‌. పాకిస్థాన్ ఉగ్ర‌వాదానికి ఊతం ఇస్తోంద‌ని హ‌ఫీజ్ వ్యాఖ్య‌లే చెబుతున్నాయి. ఒక ఉగ్ర‌వాద సంస్థ ఛాఫ్ ఇలా బ‌రితెగించి, ప‌ట్ట‌ప‌గ‌లే ప్ర‌జ‌ల ముందు మ‌ట్లాడేంత స్వేచ్ఛ పాకిస్థాన్ లో ఉంటే... దాన్ని ఏమ‌నుకోవాలి..?