Begin typing your search above and press return to search.

రెడ్ సిగ్నల్ ఇచ్చినా డ్రైవర్ పోనిచ్చి ముంచాడు!

By:  Tupaki Desk   |   19 Sep 2019 8:42 AM GMT
రెడ్ సిగ్నల్ ఇచ్చినా డ్రైవర్ పోనిచ్చి ముంచాడు!
X
గోదావరిలో పడవ ప్రమాదం ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యమే అని అందులో ప్రయాణించి బతికి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కచ్చలూరు వద్దకు రాగానే జాలర్లు రెడ్ సిగ్నల్ ఇచ్చినా బోటు డ్రైవర్ ఆపకుండా ముందుకు సాగాడని.. మరుక్షణమే సుడిగుండంలో చిక్కుకొని బోటు బోల్తా పడిందని ప్రమాదం నుంచి ప్రాణాలతో హయత్ నగర్ కు చెందిన జరణీకుమార్ - అర్జున్ లు మీడియాకు తెలిపారు.

మధ్యాహ్నం భోజనానికి టైం అయ్యిందని అనగానే అందరూ లైఫ్ జాకెట్లు తీశారని.. అంతేకాకుండా వేడిమికి చాలా మంది జాకెట్లు వేసుకోలేదని.. అదే వారి ప్రాణాలు తీసిందని జరణి - అర్జున్ లు తెలిపారు. ప్రమాదం సమయంలో మా ఫ్రెండ్ విశాల్ బాత్రూంకు వెళ్లి అందులోనే ఇరుక్కుపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము బోటుపైన ఉండి జాకెట్ వేసుకోవడంతో బతికి బట్టకట్టామన్నారు. జాలర్లు వచ్చి తమను రక్షించి పడవలో ఒడ్డుకు చేర్చారన్నారు. మా ఇద్దరు సోదరులను కోల్పోయామని భోరుమన్నారు.

*బోటును తీస్తే సంచలనమే..

మహాసముద్రాలు - బలిమెల రిజర్వాయర్ - దేశంలోని చాలా సరస్సుల్లో బోట్లను వెలికి తీసిన దేశ విదేశీ నిపుణులు నలుమూలల నుంచి గోదావరి కచ్చలూరు వద్దకు వచ్చి పరిశీలిస్తూ ఇక్కడ బోటును తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడి పరిస్థితులు చూసి వెనక్కి వెళ్లిపోతున్నారట.. బోటును బయటకు తీస్తే సంచలనమే అన్నట్టు పరిస్థితి తయారైందంటున్నారు. ఎన్నో బోట్లను క్లిష్ట పరిస్థితుల్లో తీసిన వారు కూడా ఇక్కడ గోదావరి ఉధృతి.. ఎరుపు రంగు నీరుతో ఉధృతంగా పోతున్న ప్రవాహం చూసి బోటును తీయడం కష్టమని నిర్ధారణకు వస్తున్నారట..

ప్రధానంగా ఇక్కడ నీటి వేగం.. నీటిలో ఉన్న బురద.. 25 టన్నుల భారీ బరువున్న బోటును బయటకు తీయడం కష్టంగా మారింది. ఇక్కడ భారీ పడవను నిలిపినా కుదురుగా ఉండే పరిస్థితి లేదని . దాన్నుంచి కిందనున్న బోటుకు తాళ్లు కడుదామన్నా.. బెలూన్స్ తో లేపుదామన్నా కింద నీటి వేగానికి అడుగుకు చేరని పరిస్థితి ఉందట.. సో మొత్తం 47మంది గల్లంతైన వారిలో ఇప్పటికే 34 మంది శవాలు దొరికాయని.. మిగతా 13 మంది దొరికితే బోటును జలగర్భంలోనే వదిలేస్తామని అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది. గోదావరి నదిలోని ప్రతీకూల పరిస్థితులే ఇక్కడి బోటును తీయకపోవడానికి కారణంగా చెబుతున్నారు.