Begin typing your search above and press return to search.

బీ అలర్ట్; పరిచయమైనోళ్లంతా ఫ్రెండ్స్ కాదు

By:  Tupaki Desk   |   26 May 2016 10:32 AM GMT
బీ అలర్ట్; పరిచయమైనోళ్లంతా ఫ్రెండ్స్ కాదు
X
రోజులు మారిపోయాయి. గతంలో ఫ్రెండ్ అనటానికి కొన్ని నెలలు అయిన పట్టేది. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. నాలుగు మాటలు కలవగానే.. ఫ్రెండ్స్ అనుకోవటం.. ఆ తర్వాత రెండుసార్లు కలిసి వెళ్లగానే.. వీడు నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేయటం ఈ మధ్యన అలవాటైంది. ఇలాంటి తీరు అబ్బాయిలే కాదు అమ్మాయిల్లోనూ అదే పరిస్థితి. ఊరికే నమ్మేయటం.. పరిచయమైన వాళ్లంతా ఫ్రెండ్స్ అన్న భావనకు రావటం.. వారితో వ్యక్తిగత విషయాల్ని కూడా చెప్పేసుకోవటం ఒక అలవాటుగా మారింది.

అయితే.. ఇలా పరిచయం అయిన వాళ్లంతా స్నేహితులు ఎంతమాత్రం కాదని.. పరిచయస్తులు మాత్రమేనని.. ఇలా ముక్కు ముఖం తెలీకుండా పరిచయమై.. స్నేహం చేసేస్తే ఎంతటి దారుణమైనా జరిగే అవకాశం ఉందన్న విషయం ఒకే రోజు రెండు వేర్వేరు ఉదంతాలు స్పష్టం చేశాయి. అందుకే.. నాలుగు మాటలు కలిసి కూర్చొని మాట్లాడగానే స్నేహితులుగా ఫీలయ్యే పని చేస్తే.. అది ప్రాణాలు తీసే వరకూ వెళ్లినా సందేహం లేదు. అలా అని ఎవరినీ నమ్మొద్దని చెప్పటం లేదు. కాకుంటే.. అందరిని అదే పనిగా నమ్మటం సరికాదని చెప్పటమే మా ఉద్దేశ్యం. తాజాగా బయటకు వచ్చిన రెండు ఉదంతాలు విన్నప్పుడు.. పరిచయస్తుల్ని స్నేహితులుగా భావించటం ఎంత తప్పో తెలుస్తుంది.

మహబూబ్ నగర్ జిల్లా గద్వాలకు చెందిన 26 ఏళ్ల హషీమ్ ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బల్కంపేటలో ఉండే ఇతగాడు సోమవారం ఆఫీసుకు వెళ్లి తిరిగి రాకపోవటం.. దీంతో సందేహం వచ్చిన అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హషీమ్ హత్యకు గురైన విషయం బయటకు వచ్చింది. ఇంతకీ హషీమ్ ను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. హషీమ్ ను చంపింది ఎవరో కాదు.. అతని స్నేహితుడు నరేశ్. కేవలం 15 రోజుల పరిచయాన్ని ఫ్రెండ్ షిప్ గా ఫీలై నమ్మిన దానికి ప్రతిగా హషీమ్ తన ప్రాణాల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. తన అవసరాల కోసం రూ.10వేలు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో హషీమ్ ను.. నరేశ్ చంపేశాడు. మృతి చెందిన హషీమ్ ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శి మధు సమీప బంధువు.

స్నేహితుడని నమ్మిన పాపానికి ఒక మహిళ జీవితం ఎలా తయారైందన్న దానికి నిదర్శనంగా మరో ఉదంతాన్ని చెప్పొచ్చు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఒక మిస్డ్ కాల్ తో మొదలైంది. తమకూరుకు చెందిన ఒక అమ్మాయికి చిక్కబళ్లాపురకు చెందిన ఒక అబ్బాయి మిస్డ్ కాల్ తో పరిచయం అయ్యాడు. అది కాస్త స్నేహంగా మారింది. ఆ పై ప్రేమగా రూపాంతరం చెందింది. చూసుకోకుండానే వారి మధ్య ఊసులు పెళ్లి వరకూ వెళ్లాయి. పెళ్లి చేసుకుంటానన్న తియ్యటి మాటలు నమ్మిన సదరు యువతి యువకుడు ఉన్న ఊరికి వచ్చింది.

నమ్మి వచ్చిన ఆమెకు మాయమాటలు చెప్పి.. ఆమెను ఒక గదిలో బంధించి తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు సాగిన ఈ అత్యాచార కాండ నుంచి ఎలాగోలా బయటపడిన ఆమె.. పోలీసుల్ని ఆశ్రయించటంతో అసలు విషయం బయటకు వచ్చింది.