Begin typing your search above and press return to search.

ట్రంప్ బెదిరింపు హైద‌రాబాద్‌ కు షాకే

By:  Tupaki Desk   |   14 May 2018 4:24 AM GMT
ట్రంప్ బెదిరింపు హైద‌రాబాద్‌ కు షాకే
X
త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు - వివాదాస్ప‌ద కామెంట్లు చేసే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోమారు అదే త‌ర‌హాలో కామెంట్లు చేశారు. అమెరికాకు మేలు చేసే నిర్ణ‌యాలు తీసుకుంటున్నాన‌నే భావ‌న‌తో ఉన్న ట్రంప్...అగ్ర‌రాజ్యం తెచ్చిపెట్టిన స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని తుంగ‌లో తొక్కుతూ ఇప్ప‌టికే ప‌లు చ‌ర్య‌ల‌తో వివిధ దేశాల‌ను కెలికారు. అయితే ఇప్పుడు ట్రంప్ క‌న్ను భార‌త్‌పై ప‌డింది. అది ఏకంగా బెదిరింపుల వ‌ర‌కు వెళ్లింది. అయితే ట్రంప్ తాజా ఆగ్ర‌హం క‌నుక ప్ర‌భావం చూపిస్తే అది హైద‌రాబాదీల‌పై పెద్ద ఎత్తున్నే భారం ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...ప్రపంచ దేశాలతో మరోసారి కయ్యానికి కాలు దువ్వుతున్నే ప్ర‌క‌ట‌న‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు. అత్యంత ఖరీదైన ఔషధాలు - వైద్య పరికరాల ధరలను స్వయంగా తామే నిర్ణయించాలని భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ఔషధ పరిశ్రమ ఇప్పటికే వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా ట్రంప్ తాజాగా భ‌గ్గుమ‌న్నారు. అమెరికా ఔషధాలు - వైద్య పరికరాల ధరలను ప్రపంచ దేశాలు తమ ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని ఆయన ఆరోపిస్తూ.. ఇటువంటి దేశాలకు అభ్యంతరాలను తెలియజేయాల్సిందిగా అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్‌ టీఆర్)ని ఆదేశించారు. అమెరికాలోని పరిశోధన - అభివృద్ధి సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఇతర దేశాలు ఈ ధరలను నిర్ణయించడం ఏమాత్రం సమర్థ‌నీయం కాదని, ఇటువంటి ధోరణిని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విష‌యంలో ఏకంగా వైట్‌ హౌస్ నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయించ‌డం గ‌మ‌నార్హం

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌ లోని రోజ్ గార్డెన్‌ లో చేసిన విధాన ప్రసంగంలో ట్రంప్ మాట్లాడుతూ....అమెరికా పేటెంట్ హక్కుల విషయంలో స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా పారదర్శకత ఉండాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఒకవైపు అమెరికాలోని ఔషధ ఉత్పత్తిదారుల నుంచి విదేశీ ప్రభుత్వాలు కారుచౌక ధరలకు మందులను కొనుగోలు చేస్తుంటే.. మరోవైపు తమ దేశంలో ఔషధ పరిశోధన - అభివృద్ధి కార్యక్రమాలకు రాయితీలను అందించేందుకు అమెరికా ప్రజలు ఇవే మందులను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నదని భ‌గ్గుమ‌న్నారు. ``ఒకే ప్లాంట్‌ లో తయారై ఒకే ప్యాకేజీతో మార్కెట్లోకి వచ్చిన ఒకేవిధమైన మందులను విదేశాల్లో చాలా తక్కువ ధరకు అమ్ముతుంటే.. అవే మందులు అమెరికాలో వందలాది డాలర్ల ధర పలుకుతుండటం చాలా హాస్యాస్పదం - అన్యాయం. ఏవిధంగానూ ఇది ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి ధోరణిని ఇక ఎంతమాత్రం సహించేది లేదు`` అని ట్రంప్ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్యానికి శాశ్వతంగా చరమగీతం పాడాల్సిన తరుణం ఆసన్నమైందని - ఔషధ ధరల విషయంలో ప్రతి భాగస్వామ్య దేశానికి అభ్యంతరాన్ని తెలియజేసి ఇకమీదట అమెరికాకు అన్యాయం జరుగకుండా నివారించాల్సిందిగా తమ వాణిజ్య ప్రతినిధి బాబ్ లైట్‌ హైజర్‌ ను ఆదేశించానని ట్రంప్ తెలిపారు. ``వాణిజ్య భాగస్వాముల కంటే అమెరికా ఎంతో శక్తివంతమైనది. ఈ విషయం అందరికీ తెలుసు. ఇకపై అమెరికాను ఎవరూ మోసం చేయలేరు. ప్రత్యేకించి విదేశాల చేతిలోనూ మోసపోయేందుకు అమెరికా సిద్ధంగా లేదు`` అని ఆయన పేర్కొన్నారు.

తమ దేశంలో ఔషధాల ధరలను తగ్గించేందుకు విధానపరంగా ట్రంప్ చేపడుతున్న కొత్త చర్యలు అమెరికా - భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని విశ్లేష‌కులు అంచ‌నావ వేస్తున్నారు. మ‌రోవైపు ఇది నేరుగా హైద‌రాబాదీ కంపెనీల‌పై ప్ర‌భావం చూప‌నుంద‌ని అంటున్నారు. హైద‌రాబాద్ కేంద్రంగా అనేక ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫార్మా - బల్క్ డ్ర‌గ్‌ - లైఫ్ సైన్సెస్‌ - జెన‌రిక్ మందుల కంపెనీలు ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. వీటిలో అనేకం అమెరికాకు ఎగుమ‌తులే న‌మ్ముకున్నాయి. ఈ నేప‌థ్యంలో ట్రంప్‌ తాజా నిర్ణ‌యం ఆ సంస్థ‌ల ఆర్థిక స్థితిగ‌తుల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.