Begin typing your search above and press return to search.

ఆ మీటింగ్‌ ను కంపు చేసి పారేసిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   28 May 2017 9:41 AM GMT
ఆ మీటింగ్‌ ను కంపు చేసి పారేసిన ట్రంప్‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న దుందుడుకు నిర్ణ‌యాల‌తో ఇన్నాళ్లు సామాన్యుల‌ను, ఉద్యోగులను, అతిథుల‌ను ఇరకాటంలో ప‌డేస్తుంటే...ఇప్పుడు ఆ జాబితాలో దేశాధినేత‌లు కూడా చేరిపోయారు. తాజాగా ట్రంప్ చేసిన ర‌చ్చ‌కు అత్యంత శక్తివంత దేశాల అధినేత‌లు తీవ్ర ఇర‌కాటంలో ప‌డిపోయారు. ప్ర‌పంచంలోనే అత్యంత బ‌ల‌మైన దేశాల‌నే పేరున్న జీ 7 కీలక వార్షిక సమావేశాలు ఇటలీలో ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సమావేశాలలో ఆదిలోనే ట్రంప్ కార‌ణంగా ప్రతిష్టంభన ఏర్పడింది.

ఇటలీలోని సిసిలీలో రెండు రోజుల పాటు జీ7 సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఈ దేశాల మధ్య ప్రధానంగా వాతావరణ మార్పులు, వాణిజ్య సంబంధాలపైనే చర్చ జరుగనుంది. సదస్సు నేపథ్యంలో కీలక అంశాలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. కార్బన్ ఉద్గారాలపై అదుపునకు సంబంధించిన పారిస్ ఒప్పందం కూడా ఈ సదస్సులో ప్రస్తావనకు రానుంది. పారిస్ ఒప్పందం గురించి అమెరికా వైఖరిపై తాను తమ నిర్ణయాన్ని వచ్చేవారం వెల్లడిస్తామని ట్రంప్ ట్వీట్ చేశారు. దీనితో జీ7 సదస్సులో వాతావరణ అంశంపై సందిగ్ధత నెలకొంది. జీ7లోని ఏడింటిలో ఆరు దేశాలు వాతావరణ మార్పుల 2015 నాటి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నాయి. అయితే అమెరికా వీటితో అప్పట్లో ఏకీభవించలేదు. నిర్ణయాన్ని వాయిదా వేసింది. పారిస్ సదస్సు ఒప్పందంపై అమెరికా తమ విధానాలకు అనుగుణంగా అన్నింటినీ సమీక్షించుకుని ఒక నిర్ణయానికి వస్తుందని అమెరికా తెలిపింది.

ఇక స్వేచ్ఛా వాణిజ్య అంశంపై కూడా ట్రంప్‌ తో జర్మనీ అధ్యక్షులు ఏంజెలా మెర్కెల్ విభేదించారు. ట్రంప్ వైఖరిపై ఆమె మండిపడ్డారు. వాణిజ్య సంబంధాలపై సహచరులను ట్రంప్ అయోమయంలోకి నెడుతున్నారని విమర్శిం చారు. ఓ వైపు పర్యావరణం, వాతావరణ మార్పులపై సామరస్యం లేదని , ప్రతిష్టంభన అంతా అమెరికా వల్లనే అని పరోక్షంగా స్పందించారు. ఆరుగురు ఒకవైపు ఒకరు మరోవైపు ఉన్నారని తెలిపారు. వాణిజ్య వ్యవహారాలకు సంబంధించి అన్ని దేశాల మధ్య విప‌ణి స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నామని జర్మనీ నేత చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికాకే తొలి ప్రాధాన్యం తరువాత ఇతర కూటములు ఇతర దేశాలు అని స్పష్టం చేయడంతో దీని ప్రభావం జీ7 సదస్సుపై పడింది. తిరోగమన దిశలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీ7 నుంచి శుభ సందేశం అందాల్సి ఉందని వివిధ దేశాధినేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా యుద్ధ నేరాల పక్షాలకు రష్యా తోడ్పాటు కొనసాగితే కఠిన చర్యల ప్రతిపాదనల అంశం కూడా సదస్సులో ప్రస్తావనకు రానుంది. ఉత్తర కొరియా , ఇరాన్‌పై శాంతి ప్రక్రియకు ఒత్తిడి వంటి అంశాలపై కూడా ఈ సదస్సులో చర్చ జరుగనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/