Begin typing your search above and press return to search.

డొక్కా టీడీపీ ప్రవేశానికి ముహూర్తం అదిరింది..

By:  Tupaki Desk   |   2 Aug 2015 11:29 AM GMT
డొక్కా టీడీపీ ప్రవేశానికి ముహూర్తం అదిరింది..
X
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆగస్టు 15వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు రంగం సిద్ధమైందని అంటున్నారు. డొక్కా పార్టీలోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శనివారం నాడు ఎంపీ రాయపాటి సాంబశివ రావు వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతో డొక్కాను చేర్చుకునేందుకు సిఎం చంద్రబాబు అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాక డొక్కా కొద్ది రోజులు తన రాజకీయ భవితవ్యంపై మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన వైసీపీతో సంప్రదింపులు కూడా జరిపారు... ఆ సమయంలో డొక్కా రాజకీయ గురువు, టీడీపీ ఎంపీ రాయపాటి ఆయన్ను ఆపి టీడీపీలో చేరాలని సూచించారు. దీంతో వైసీపీలోకి వెళ్లకుండా ఆగిపోయిన డొక్కా తనకు రాజకీయాలు, పదవుల కంటే తన గురువు రాయపాటే ఎక్కువని చెప్పారు కూడా. అయితే... వెంటనే టీడీపీలో చేరని ఆయన ఇప్పుడు ఆగస్టు 15న చేరుతారని సమాచారం. భారతదేశంలో ఆగస్టు 15 అంటే పండుగ రోజు... అలాంటి శుభదినాన ఆయన టీడీపీలో చేరడం మంచి పరిణామమని ఆయన అనుచరులు అంటున్నారు.