Begin typing your search above and press return to search.

డొక్కా చేరిక‌తో పోరు మొద‌లైందా?

By:  Tupaki Desk   |   31 Aug 2015 6:30 AM GMT
డొక్కా చేరిక‌తో పోరు మొద‌లైందా?
X
తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ చేరిక‌తో గుంటూరు జిల్లా టీడీపీలో పోరు మొద‌లైందా? మాజీ మంత్రి చేరిక‌పై పార్టీ సీనియ‌ర్లు, తెలుగుత‌మ్ముళ్లు పార్టీ అధినేత వ‌ద్ద కూడా నిర‌సన తెలిపారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌ లో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలుగుదేశం కండువా వేసుకున్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న ఆయన... ఐదేళ్ళు మంత్రిగా పని చేశారు. ఎన్నికలకు ముందే డొక్కా పార్టీ మారతారన్న ప్రచారం జరిగినా... రకరకాల కారణాలతో ఆలస్యమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ దారుణంగా దెబ్బతినడంతో అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశారు. మధ్యలో వైసీపీ లో చేరడం దాదాపు ఖాయమై...చివరి నిమిషంలో ఆగిపోయింది. వైసీపీ, టీడీపీ మధ్య ఊగిసలాడిన మాజీ మంత్రి చివరికి అధికార పార్టీ వైపే మొగ్గారు. తన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు సూచనతో చివరికి డొక్కా టీడీపీ గూటికి చేరారు. తనతో పాటు మరికొంత మంది స్థానిక ప్రజా ప్రతినిధులను టీడీపీ లోకి తీసుకువచ్చారు.

అయితే మాణిక్యవరప్రసాద్‌ రాకపై గుంటూరు టీడీపీలో అసంతృప్తులు మొదలయ్యాయి. పార్టీలోకి డొక్కా రాకను గుంటూరు జిల్లా టీడీపీకి చెందిన నాయకులు కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాజిక సమీకరణల కోణంలో ఈ వ్యతిరేకత ఉన్నట్టు తెలిసింది. తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి పుష్పరాజ్ మాణిక్య వరప్రసాద్‌ చేరిక కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వీరు త‌మ ఆవేదనను , అభ్యంత‌రాన్ని పార్టీ అధినేత చంద్ర‌బాబుకు కూడా చెప్పిన‌ట్లు స‌మాచారం.