Begin typing your search above and press return to search.

తలాక్‌ పై మోడీ ఇలా రియాక్ట‌య్యారు

By:  Tupaki Desk   |   29 April 2017 11:02 AM GMT
తలాక్‌ పై మోడీ  ఇలా రియాక్ట‌య్యారు
X
ముస్లిం సంప్ర‌దాయంలోని వివాదాస్ప‌ద ట్రిపుల్ త‌లాక్ అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని వినిపించారు. ట్రిపుల్ త‌లాక్ అంశాన్ని రాజ‌కీయ కోణంలో చూడ‌రాద‌ని ప్ర‌ధాన‌మంత్రి కోరారు. బ‌స‌వ జ‌యంతి సంద‌ర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌ లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ముస్లిం మ‌హిళ‌ల‌కు కూడా స‌మాన హ‌క్కులు క‌ల్పించాల‌న్నారు. ట్రిపుల్ త‌లాక్ లాంటి చెడు ప‌ద్ధ‌తుల నుంచి మ‌హిళ‌ల‌ను కాపాడుకునే సంస్క‌ర‌ణ‌ల‌కు ముస్లిం మ‌త‌పెద్ద‌లు దారులు వెతుకుతార‌న్న అశాభావాన్ని కూడా ప్ర‌ధాని వ్య‌క్తం చేశారు. దేశంలో ఎలాంటి వివక్షకు తావులేదని, ‘సబ్‌ కా సాత్‌ - సబ్‌ కా వికాస్‌’ అన్నదే ప్రభుత్వ సిద్ధాంతమని, ప్రజల పట్ల ఎలాంటి వివక్ష చూపకుండా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నదని చెప్పారు. బసవ బోధనలను సంగ్రహించాలని మోడీ సూచించారు. అహింస - సత్యాగ్రహం - సుపరిపాలన గురించి భారత్ చాలా మంచి సందేశం ఇచ్చిందన్నారు.

ఇటీవ‌ల భువ‌నేశ్వ‌ర్‌ లో జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలోనూ మోడీ ట్రిపుల్ త‌లాక్‌ పై మాట్లాడారు. ఆ స‌మావేశంలో సామాజిక న్యాయం గురించి ప్ర‌ధాని మాట్లాడార‌ని, ముస్లిం సోద‌రీమ‌ణుల‌కు న్యాయం క‌ల్పించాల‌ని, వాళ్ల‌కు అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని ప్ర‌ధాని పేర్కొన్న‌ట్లు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ గుర్తు చేశారు. కాగా, ట్రిపుల్ తలాక్ ఎత్తివేయాలంటూ ఇటీవల పలువురు ముస్లిం మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్న‌వించిన సంగ‌తి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/