Begin typing your search above and press return to search.

కేసీఆర్ కాళేశ్వ‌ర‌రావు కాదు...కాటేశ్వ‌ర‌రావు

By:  Tupaki Desk   |   22 Jan 2018 4:34 PM GMT
కేసీఆర్ కాళేశ్వ‌ర‌రావు కాదు...కాటేశ్వ‌ర‌రావు
X
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ త‌న పదవిని కించపరిచారని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఎమ్మెల్యే డీకే అరుణ మండిప‌డ్డారు. రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి ప్రజలకు రక్షణగా - రాష్ట్రానికి రాజ్యాంగ పరిరక్షణగా ఉండాల్సిన గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వర చంద్రశేఖర్ రావు - హరీష్ రావుని కాళేశ్వరరావు అని పొగడడం గ‌వర్నర్ పదవిని కించపరిచే విధంగా ఉందని విమ‌ర్శించారు. గవర్నర్ తన బాధ్యతను విస్మరించి - ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా పాలకుల మెప్పు కోసం పాకులాడుతున్నట్టుందని వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ - భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి కాళేశ్వర్ రావులు కాదు - కాటేశ్వర్ రావులు - కమీషన్ల రావులు...ప్రాణహిత ప్రాణం తీశారు...పాలమూరును పరేషాన్ చేశారు అని డీకే అరుణ విరుచుకుప‌డ్డారు.

ప్రాణహిత ప్రాజెక్టుకు పునాది వేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వమ‌ని డీకే అరుణ స్ప‌ష్టం చేశారు. గోదావరి జలాలను ఉత్తర - దక్షిణ తెలంగాణకు అందించాలనే లక్ష్యంతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింద‌ని ఆమె వివ‌రించారు. 38 వేల కోట్ల రూపాయలతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు - వేలాది గ్రామాలకు - హైద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు - పరిశ్రమలకు నీరు అందించే బహుళార్ధక ప్రాజెక్టు అని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడ కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందని అయితే...టీఆర్ ఎస్ సార‌థ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టు డిజైన్లు మార్చి - పేరు మార్చి - వేల కోట్లకు అంచనాలు పెంచి - రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసింద‌ని డీకే అరుణ ఆరోపించారు. వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజల మీద మోపి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు మీద ఉన్న ఈ ప్రాజెక్టు పేరు మార్చి మోసం చేస్తుంటే... నాటి నుండి నేటి వరకు ప్రత్యక్ష సాక్షిగా అన్నీ తెలిసిన గవర్నర్ ఈ విధంగా మాట్లాడడం శోచనీయమని డీకే అరుణ అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 10 వేల కోట్లు అప్పటికే వ్యయం చేసింది - జాతీయ ప్రాజెక్టు అయితే కొత్త ర్రాష్ట్రం మీద ఒక్క పైసా భారం పడకుండా ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయ్యేదని అరుణ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ముందు పెట్టి - ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లా ఆయకట్టును తొలగించి కొత్త సమస్యలకు - వివాదాలకు తెర లేపారని మండిప‌డ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును 81 వేల కోట్లకు పెంచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు వేలాది కోట్లు దోచిపెట్టి కమిషన్లు దోచుకున్నారని ఆరోపించారు. భూ సేకరణలో రైతులను అణచివేసి అక్రమంగా ఆక్రమించారని దుయ్య‌బ‌ట్టారు. ఇలా అన్ని రకాల చట్ట - రాజ్యాంగ వ్యతిరేకంగా - రైతు - ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్న కేసీఆర్ మీకు దేవుడిలా కనిపించారా..? అని గ‌వ‌ర్న‌ర్‌ను నిల‌దీశారు. ``గ‌వర్నర్ గారూ వారు కాళేశ్వర రావులు కాదు తెలంగాణ ను కాటేస్తున్న కాటేశ్వర రావులు. దయచేసి గ్రహించాలని - తెలంగాణను కాపాడాలని గవర్నర్ గారిని కోరుతున్నాము.` అంటూ అరుణ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.