Begin typing your search above and press return to search.

ఈ యాప్‌ తో కొంటే పెట్రోల్ - డీజిల్ ధ‌ర త‌గ్గిపోతుంది

By:  Tupaki Desk   |   12 Oct 2017 8:38 AM GMT
ఈ యాప్‌ తో కొంటే పెట్రోల్ - డీజిల్ ధ‌ర త‌గ్గిపోతుంది
X
బైకు - కార్లున్న మోటార్ వాహనాల వినియోగదారులకు శుభవార్త. భీమ్ యాప్ ద్వారా పెట్రోల్ - డీజిల్‌ ను కొనుగోలు చేసే వినియోగదారులకు రాయితీ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లీటర్ పెట్రోల్‌ పై 49 పైసలు - డీజిల్‌ పై 41 పైస రాయితీ కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నంథనం బుధవారం ట్వీట్ చేశారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారమే పెట్రోల్ - డీజిల్‌ పై లీటర్‌ కు రూ.2 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

మ‌రోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ సర్కార్ దీపావళి కానుక అంటూ పెట్రోల్ - డీజిల్‌ పై వ్యాట్‌ ను 4 శాతం తగ్గించింది. మహారాష్ట్ర - హిమాచల్‌ ప్రదేశ్ కూడా ఇదేదారిలో వ్యాట్‌ కు కోతపెట్టాయి. 4 శాతం వ్యాట్ కోత వల్ల గుజరాత్‌ లో పెట్రోల్ ధర రూ.2.93 - డీజిల్ ధర రూ.2.72 తగ్గుతుంది. తగ్గింపు అనంతరం పెట్రోల్ ధర లీటరుకు రూ.67.53, డీజిల్ ధర లీటరుకు రూ.60.77గా నిర్ణయించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. గుజరాత్ ప్రభుత్వం ఇదివరకు పెట్రోల్ - డీజిల్‌ పై 20 శాతం వ్యాట్ - 4 శాతం సెస్ విధించేది. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వ్యాట్ తగ్గించినట్టు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ప్రకటించారు. ``ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనిని ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయంగా చూడరాదు`` అని ఆయన అన్నారు. దీనివల్ల ఖజానాకు ఏటా రూ.2,316 కోట్ల నష్టం వస్తుంది.

మరోవైపు విపక్ష కాంగ్రెస్ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యబట్టింది. కేవలం రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారానికి ప్రజల్లో లబించిన స్పందనను చూసి దడుసుకుని బీజేపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించిందని కాంగ్రెస్ గుజరాత్ విభాగం అధికార ప్రతినిధి శక్తిసింగ్ గోహిల్ అన్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ కూడా పెట్రోల్ - డీజిల్‌ పై 1 శాతం వ్యాట్ తగ్గించింది. ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ - డీజిల్‌ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున తగ్గించింది. రాష్ట్రాలూ తమవంతుగా వ్యాట్ తగ్గించుకోవాలని అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రులకు రాసిన ఒక లేఖలో సూచించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌ పై రూ.2 - డీజిల్‌ పై రూపాయి మేర వ్యాట్‌ ను తగ్గించింది. ఆర్థికమంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ తగ్గింపును దీపావళి కానుక గా అభివర్ణించారు. మహారాష్ట్ర ఆర్థికస్థితి అంత బాగాలేకపోయినా ప్రజల కోసం అదనపు ఆర్థికభారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం కూడా గుజరాత్ తరహాలోనే మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చింది. ఈ తగ్గింపువల్ల రాష్ట్ర ఖజానాపై రూ.2000 కోట్ల భారం పడుతుంది.