Begin typing your search above and press return to search.

శత్రువుతో మిత్రుడిలా బాబు..మాట మీద కేసీఆర్..

By:  Tupaki Desk   |   24 May 2018 6:48 AM GMT
శత్రువుతో మిత్రుడిలా బాబు..మాట మీద కేసీఆర్..
X
రాజకీయాల్లో ఊసరవెల్లులు ఎక్కువ.. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. రాజకీయ అవసరాలకు ఏ పార్టీతో కలుస్తారో తెలియదు.. శత్రువులను సైతం మిత్రులుగా చేసుకుంటూ రాజకీయ విలువలకు తిలోదకాలిస్తుంటారు. ఆడిన మాటను తప్పేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. తమ అవసరాల కోసం గొంగలి పురుగునైనా ముద్దుపెట్టుకొనే రాజకీయ నాయకులకు ఈ సమాజంలో కొదవలేదు.. కానీ అన్న మాట మీద నిలబడి ప్రస్తుతం కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు.. తన బద్ధశత్రువుతో కలిసిపోయి చంద్రబాబు అభాసుపాలయ్యారు.

తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారసభకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ హాజరయ్యాయి.. దేశంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధినేత రాహుల్ - మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా వచ్చి ఈ ముచ్చటలో పాలుపంచుకున్నారు. కానీ ఒక్క కేసీఆర్ మాత్రమే సభకు పోలేదు.. ముందురోజే వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. దీనివెనుక పెద్ద కథే ఉంది..

*కేసీఆర్ ఆడిన మాట తప్పలేదు..

కేసీఆర్ దేశ రాజకీయాలవైపు దృష్టిసారించారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ - బీజేపీ పాలనలో ఏమీ ఒరగలేదని.. ఫెడరల్ ఫ్రంట్ కు శ్రీకారం చుట్టాడు. ఈ నేపథ్యంలోనే దేశంలోని కాంగ్రెస్ - బీజేపీలను మినహాయించి ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా తిరిగారు. తృణ మూల్ అధినేత్రి మమతను - సమాజ్ వాదీ నేత అఖిలేష్ యాదవ్ - కర్నాటకలో జేడీఎస్ దేవగౌడను - తమిళనాట డీఎంకేను కలిసి వచ్చి ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములు కావాలని కోరారు. కాంగ్రెస్ - బీజేపీ ముక్త భారత్ కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అందరూ సానుకూలంగా స్పందించారు. ఈ లోపే కర్ణాటకలో అనుకోని విధంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని జేడీఎస్ అధికారం చేపట్టింది. సీఎం కుమారస్వామి కేసీఆర్ - చంద్రబాబు సహా దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండడంతో ఈ వేడుకకు సోనియా - రాహుల్ తో పాటు ప్రాంతీయ పార్టీల నేతలందరూ హాజరయ్యారు.. ఒక్క కేసీఆర్ తప్ప.. కేసీఆర్ ముందు రోజే కుమారస్వామిని కలిసి వేడుకకు హాజరు కాలేనని చెప్పివచ్చారు. కానీ దీనివెనుక కాంగ్రెస్ అంటే అయిష్టమే కారణం.. కాంగ్రెస్ వ్యతిరేక భారతాన్ని ఆవిష్కరించాలనుకుంటున్న కేసీఆర్ కు కర్ణాటకలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో సోనియా - రాహుల్ పాల్గొనబోతుండడంతో వారితో సీటు షేర్ చేసుకోలేక కేసీఆర్ సభకు హాజరుకాలేదు. ఫెడరల్ ఫ్రంట్ పెట్టేదే కాంగ్రెస్ - బీజేపికి వ్యతిరేకంగా.. అలాంటిది కాంగ్రెస్ పక్కన కూర్చుంటే తప్పుడు సంకేతాలు వెళతాయి. తన ఆశయానికి ఇది తూట్లు పొడుస్తుందని.. అందుకే ఈ సభకు దూరంగా జరిగారు.. తెలంగాణలో బద్ధశత్రువుగా.. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడంతో ఆ వేడుకకు హాజరు కావడం నైతికంగా మంచిది కాదని హాజరుకాలేదు.

*బాబుకు.. ఈ నియమాలేవీ లేవు..

తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా.. అప్పటివరకు అప్రతిహతంగా ఏపీలో పాలిస్తున్న కాంగ్రెస్ ను కేవలం 8నెలల్లోనే తెలుగుదేశం పార్టీ స్థాపించి అన్న ఎన్టీఆర్ అధికారాన్ని సంపాదించారు. నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశానికి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే.. అలాంటిపార్టీ తోనే కన్నడనాట కుమారస్వామి పొత్తు పెట్టుకొని సీఎం అవ్వబోతున్నారు. ఈ సభకు సోనియా, రాహుల్ కూడా వచ్చేశారు. మరి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని ప్రస్తుతం లీడ్ చేస్తున్న చంద్రబాబు ఆ సభకు హాజరుకావడం.. కాంగ్రెస్ నాయకులతో కలిసిపోవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను బాబు తుంగలో తొక్కారని.. అధికారం కోసం ఇలా కాంగ్రెస్ పంచన చేరబోతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. సోనియా, రాహుల్ తో పాటు చంద్రబాబు ఆ సభలో ఒకే వేదికపై కొలువుదీరడంతో బాబు నీతి, నియమాలు వదిలేశారని రాజకీయ విశ్లేషకులు, వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు...

చంద్రబాబు తన స్వార్థం కోసం ఇప్పుడు కాంగ్రెస్ తో సాన్నిహిత్యానికి పాకులాడుతున్నాడని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. మోడీతో చెడడంతో చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెసే ప్రత్యామ్మాయంగా భావిస్తున్నారు. అందుకే తెలుగుదేశానికి బద్ధవ్యతిరేకులైన కాంగ్రెస్ నేతలు కర్ణాటక సభకు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా వారితో చెట్టాపట్టాలు వేసుకొని తెలుగుదేశం అధినేత కనిపించడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్ఫూర్తి అంటున్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను కేసీఆర్ ద్వేషిస్తున్నారు. జాతీయంగా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అన్నమాట ప్రకారం కాంగ్రెస్ తో కలవకుండా కర్నాటక ముఖ్యమంత్రి ప్రమాణానికి హాజరు కాలేదు.కానీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత మాత్రం కాంగ్రెస్ అధికారం పంచుకున్న సభకు ముఖ్యఅతిథిగా హాజరై విలువలకు తిలోదకాలిచ్చారు. ఈ పరిణామాలు చూశాక ఇప్పుడందరూ ‘కేసీఆర్ మగడ్రా బుజ్జి’ అంటున్నారు.. మరి బాబును ఏమంటారో అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేస్తున్నారు.