Begin typing your search above and press return to search.

మీరు ప‌ద‌వి కోసం కక్కుర్తి ప‌డ్డారు సీఎం గారు

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:00 PM GMT
మీరు ప‌ద‌వి కోసం కక్కుర్తి ప‌డ్డారు సీఎం గారు
X
రెండాకుల గుర్తు గ‌ల త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో రాజ‌కీయాలు మ‌లుపులు తిరుగుతున్నాయి. అమ్మ‌పార్టీలోని రెండు గ్రూపులు విలీనం కావడంపై పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి - చిన్న‌మ్మ శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీటీవీ దినకరన్ స్పందించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి - ఓ పన్నీర్ సెల్వం ఇద్దరూ అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళను మోసం చేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. పళని - పన్నీరులపై తీవ్ర విమర్శలు చేస్తూ దినకరన్ వరుస ట్వీట్లు చేశారు. వారిద్దరూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని టీటీవీ ధ్వజమెత్తారు.

సీఎం పళనిస్వామి - మాజీ సీఎం పన్నీరు సెల్వం విలీన‌ ఒప్పందం ఎలా చెల్లుబాటవుతుందని దిన‌క‌ర‌న్‌ ప్రశ్నించారు. ‘అది విలీనం కాదు. పదవీ వ్యామోహంతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం. వ్యక్తిగత స్వలాభం కోసం కొత్త డ్రామాను తెరమీదకు తెచ్చారు’ అని దినకరన్ నిప్పులు చెరిగారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని రాజకీయంగా తన సత్తా ఏమిటో నిరూపిస్తానని సీఎం - డిప్యూటీ సీఎంలను ఆయన హెచ్చరించారు. అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకులకోసం పోరాడి సాధించుకుంటామని శశికళ మేనల్లుడు దినకరన్ ప్రకటించాడు. ప్రస్తుతం తాను గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నానన్న దినకరన్ త్వ‌ర‌లోనే తాను అన్నింటిపై స్పందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ‘ఏం జరుగుతుందో ఏమిటో భగవంతుడికి తెలుసు’ అని ఆయన చెప్పారు.

ఎంజీఆర్ మరణం తరువాత పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని చక్కదిద్దిన జయలలితను కార్యకర్తలే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారని దినకరన్ గుర్తు చేశారు. ఆనాడు కేడర్ అంతా జయ వెనకాలే ఉన్నారని, ఇప్పటి పరిస్థితి దానికి భిన్నంగా ఉందని ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న దిన‌క‌ర‌న్ త‌న మేన‌త్త‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప‌రోక్షంగా గుర్తు చేశారు. పళనిస్వామి - పన్నీర్ సెల్వంల అనైతిక ఒప్పందాన్ని అన్నాడీఎంకె కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రెండాకుల గుర్తుపై రాద్ధాంతం చేసి ఈసీ పరిధిలోకి వెళ్లడానికి కారకుడైన పన్నీర్ సెల్వంను కార్యకర్తలు ఎలా క్షమిస్తారని ఆయన నిలదీశారు.