Begin typing your search above and press return to search.

బాబు చేసుకున్న సెల్ఫ్‌ గోల్ ఇది

By:  Tupaki Desk   |   21 Sep 2018 1:20 PM GMT
బాబు చేసుకున్న సెల్ఫ్‌ గోల్ ఇది
X
అంశం ఏదైనా..అవ‌కాశం దొరికిందంటే చాలు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సద‌రు ఎపిసోడ్‌ ను రాజ‌కీయంగా త‌మ అవ‌సరాల‌కు త‌గిన రీతిలో వాడుకోవ‌డంలో ఆరితేరిపోయార‌నే టాక్ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇలా ప్ర‌చారాన్ని వాడుకోవ‌డంలో సిద్ధ‌మ‌స్తులు అయిన టీడీపీ నేత‌ల‌కు తాజాగా మ‌రో అంశం బాబ్లీ కేసు. ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన‌డంపై టీడీపీ నేత‌లు స‌హ‌జంగానే మీడియా ముందు విరుచుకుప‌డ్డారు. కేంద్రం కుట్ర‌ - బీజేపీ ఎత్తుగ‌డ‌ - ఉద్దేశ‌పూర్వ‌క క‌క్ష వంటి ఆరోప‌ణ‌ల‌న్నీ చేసేశారు. అయితే ఇంత హ‌డావుడి చేసిన ఆ నేత‌లు చివ‌రాఖ‌రికీ రీకాల్ పిటిష‌న్ వేసిన సంద‌ర్భంగా వ‌చ్చిన తీర్పుతో త‌మ ప‌రువ తామే తీసుకున్నార‌ని అంటున్నారు.

బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసు ఈ రోజు ధ‌ర్మ‌బాద్ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన రీకాల్‌ పిటిషన్ వేశారు. అయితే, న్యాయ‌మూర్తి దాన్ని తిర‌స్క‌రించారు. తాము ఎవరికీ స్పెషల్‌ ట్రీట్‌ మెంట్‌ ఇవ్వలేమని - ముఖ్యమంత్రి అయిన కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయ‌మూర్తి వెల్ల‌డించారు. విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేశారు. కాగా, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ అవ‌డంతో టీడీపీ నేత‌ల నోట్లో ప‌చ్చివెల‌క్కాయ ప‌డినంత ప‌ని అయింది. ఎవ‌రికీ స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఇవ్వ‌బోమ‌ని..అంతా స‌మాన‌మ‌ని న్యాయ‌మూర్తి పేర్కొన‌డం ద్వారా దేశంలోనే సీనియ‌ర్ రాజ‌కీయవేత్త అయిన చంద్ర‌బాబు సెల్ఫ్‌ గోల్ చేసుకున్న‌ట్ల‌యింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మ‌రోవైపు చంద్ర‌బాబు ఒక‌నాటి స‌హ‌చ‌రులు అయిన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ - ప్రకాశ్‌ గౌడ్ - రత్నంలు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. వారికి రూ.5వేల జరిమానా విధిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నోటీసులు అందుకున్న వారంతా అక్టోబర్ 15న హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, చంద్ర‌బాబు చేసిన ప్రయ‌త్నం మాత్రం పూర్తిగా విఫ‌లం చెందింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఈ ప‌రిణామంపై ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ రాజ్య‌స‌భ స‌భ్యుడు - బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఓ రేంజ్‌ లో విరుచుకుప‌డ్డారు. ప్రజల్లో సానుభూతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బాబ్లీ ఆందోళనకు సంబంధించి మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే దాన్నీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంలో కోర్టు 22 నోటీసులు ఇచ్చిందని - ఎంతకూ స్పందనలేకపోవడంతో కోర్టు నుంచి వారెంట్ వచ్చిందన‌నారు. వారం ముందు నుంచే నోటీసులు వస్తాయని ప్రచారం చేసుకున్నారని - టీడీపీ ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇక‌నైనా త‌దుప‌రి వాయిదాల‌కు హాజ‌రుకావాల‌ని కోరారు.