Begin typing your search above and press return to search.

ఐదేళ్ల నాటి రాతలు స్వామికి షాకిచ్చాయ్

By:  Tupaki Desk   |   28 Sep 2016 9:19 AM GMT
ఐదేళ్ల నాటి రాతలు స్వామికి షాకిచ్చాయ్
X
నోట మాట.. రాసే రాత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. అయితే.. ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు రాజకీయ నేతలు. అలా ఉన్న వారంతా ఏదో ఒక సందర్భంలో చిక్కుల్లో పడినోళ్లే. తాజాగా అలా బుక్ అయ్యారు బీజేపీ నేత.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సుబ్రమణ్యస్వామి. తన ఇంటి ముందు టీవీ ఛానళ్లు ఓబీ వ్యాన్లతో వెయిట్ చేస్తుంటాయని చెప్పే స్వామి మాటల్ని చూస్తేనే.. ఆయన చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయో తెలిసిపోతుంది. దీనికి తోడు.. మేధావి అన్న ట్యాగ్ లైన్ తో పాటు.. గతంలో ఆయన వెలుగులోకి తెచ్చిన పలు కుంభకోణాల కారణంగా ప్రభుత్వాలే ప్రభావితమైన పరిస్థితి.

ఇక.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ - ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత కూడా స్వామిదే. అలాంటి స్వామికి తాజాగా చిక్కు వచ్చి పడింది. తన అలవాటులో భాగంగా ఎప్పుడో ఐదేళ్ల క్రితం ముంబయికి చెందిన ఒక పత్రికకు ఆయనో వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో దేశంలోని ముస్లింలకు ఓటుహక్కు తొలగించాలని అప్పట్లో రాశారు. ఈ వ్యాసంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేషనల్ మైనార్టీ కమిషన్ ఫిర్యాదు చేయటం.. వెనువెంట‌నే స్వామిపై కేసు కూడా న‌మోద‌వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అప్పట్లో సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసినా విచారణ మాత్రం జరపలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనపై గతంలో నమోదైన కేసు విషయంలో సుబ్రమణ్య స్వామిని విచారించేందుకు ఢిల్లీ పోలీసులకు అనుమతి లభించింది. ఈ కేసు ఢిల్లీ హైకోర్టు విచారణకు రావటం.. స్వామిని విచారించేందుకు అనుమతించాలన్న పోలీసుల మాటకు కోర్టు ఓకే చెప్పేసింది. దీంతో.. ఆయన్ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే.. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను తోసిపుచ్చాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు స్వామి. ఇప్పటికే తన మాటలతో షాకులిచ్చిన స్వామికి.. తాను రాసిన మాటలు ఎలాంటి షాకిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/